
హైదరాబాద్: కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కవిత పార్టీకి కేటాయించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏప్రిల్ 25న తన పార్టీ పేరును తెలంగాణ రాష్ణ సేనగా కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం.. తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో కవిత పార్టీకి ఆమోద ముద్ర వేసింది.
టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు తర్వాత కవిత స్పందన :
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ చేయడానికి సంతోషిస్తున్నాము
రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేసిన కృషిని కొనసాగిస్తూ, ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకితభావంతో పని చేస్తానని తెలియజేస్తున్నాను.
జనవరి 2026 లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యత గా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం.
TRS నాకు రాసిపెట్టుండేమో!!
Telangana Rakshana Sena (TRS), it is!
We will relentlessly work to serve and protect the people of Telangana, as we have done in the last two decades as Telangana Jagruthi.
We received a letter of approval from the Election Commission in person. I would like to thank the… pic.twitter.com/YKh0u7O6Gs
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 30, 2026
ఎన్నికల సంఘం ప్రకటనతో కవిత రాజకీయ పార్టీ అయిన తెలంగాణ రక్షణ సేన రిజిస్ట్రేషన్ పూర్తయింది. బీఆర్ఎస్ వద్దనుకున్న టీఆర్ఎస్నే కవిత తన పార్టీ పేరుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పూర్తి పేరులోని చివరి పదం తప్ప.. మిగతా అంతా సేమ్ టు సేమ్ తన పార్టీకి అన్వయించుకున్నారు. ఓ రాజకీయ పార్టీ పేరు మార్పు తర్వాత పదేళ్ల వరకు మరొకరికి ఆ పేరు ఇవ్వటం కుదరదు. ఈ క్రమంలోనే.. కవిత తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసింది. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించిన కవిత.. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనగా మార్చుకున్నది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది.
ఐదు అంశాలు ప్రధానంగా ‘పాంచజన్యం’ ఎజెండాను ప్రకటించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక సమానత్వం అంటూ, వాటిపై తాము ఎలా ముందుకు వెళ్తామనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఇక జెండాను మూడు రంగుల మేళవింపుతో రూపొందించారు. పసుపు రంగు జెండాపై నీలి రంగు తెలంగాణ చిత్రం, ముదురు ఆకుపచ్చ రంగు అంచుతో జెండాను రూపొందించారు.
సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపు, బడుగు, బలహీన వర్గాల సంపూర్ణ వికాసానికి ప్రతీక అయిన నీలం, పాడిపంటలతో అలరారే గ్రామసీమలకు, రైతన్నలకు ప్రతీకగా ఆకుపచ్చ రంగులను జెండాలో పొందుపరిచారు.