
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. గత వారం వరుసగా నాలుగు రోజులు భారీ నష్టాలను ఎదుర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో మొత్తానికి వేగంగా మార్కెట్ పుంజుకుంది. ఈ వారం ప్రారంభంలో మంచి లాభాలతో ప్రారంభమైంది. ఆయా రంగాల సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 77,198 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 24, 066 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రధానంగా లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి.
గత శనివారం ఇరాన్-అమెరికా మధ్య చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగకుండానే ఇరాన్ అధికారులు తిరిగి వెళ్లిపోయారు. దీంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాలేదు. మరోసారి రెండు దేశాల మధ్య చర్చల కోసం మధ్యవర్తి అయిన పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ప్రతిపాదనల ముసాయిదాను పాకిస్థాన్కు అప్పగించేసి ఇరాన్ వెళ్లిపోయింది. ఇక హార్ముజ్ దగ్గర కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో మన మార్కెట్ వేగంగా పుంజుకుంది.