
కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలతో ప్రజలకు ‘ఈస్ట్మన్ కలర్’ రంగుల సినిమా చూపించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్తుతం ‘ఐడెంటిటీ క్రైసిస్’ (గుర్తింపు సమస్య) ఏర్పడిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇటీవల శంషాబాద్ సమీపంలో తాము గతంలో తీసుకువచ్చిన ఒక కంపెనీ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వెళ్లారని, అక్కడ పిలిచే యాంకర్ కూడా ఆయనను గుర్తుపట్టలేకపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి బదులు మంత్రి శ్రీధర్ బాబు పేరును యాంకర్ ఉచ్చరించడాన్ని ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డి కేవలం తాము కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని జేమ్స్ బాండ్ తరహాలో బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు. గ్యారెంటీ కార్డులను భద్రంగా దాచుకోమని భట్టి విక్రమార్క ప్రజలకు చెప్పారు. కానీ ఇప్పుడు 1000 రోజులు కావస్తున్నా ఆ కార్డులు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పాలి” అని ప్రశ్నించారు. రైతు, మహిళా, యువజన డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను వంచించిందని ఆరోపించారు.
హామీల అమలు గురించి అడిగితే రేవంత్ రెడ్డి వింత సమాధానాలు ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. “మూడు నెలల్లో పిల్లలు పుడతారా? అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సరే, మూడు నెలల్లో పుట్టకపోవచ్చు.. మరి 30 నెలలు గడిచినా ఒక్క హామీ అమలు కాకపోతే నిన్ను ఏమనాలి?” అని నిలదీశారు. కాంగ్రెస్ మాటలు ఆకాశంలో ఉన్నాయని, కానీ క్షేత్రస్థాయిలో పని మాత్రం సున్నా అని విమర్శించారు.
నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆరడుగుల ఎత్తు ఉన్న ఉత్తమ్ వల్ల జిల్లాకు జరిగిన లాభం ఏమీ లేదని, కృష్ణా నీళ్లు తాగి పెరగడం తప్ప రైతుల కోసం ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పుడు నల్గొండ జిల్లా రైతులే స్వయంగా చెబుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.