
భూమి మీద అన్యాయం పెరిగిపోయినప్పుడు, దేవుడు మళ్లీ పుడతాడు అన్నది ప్రజల నమ్మకం. ఇప్పుడు మనం ఉన్న కలియుగం చివరి దశకు చేరుకుందని, త్వరలోనే మహావిష్ణువు పదో అవతారమైన కల్కిగా వస్తాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కేవలం పురాణాలే కాదు.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, ఒడిశాలోని అచ్యుతానంద దాస్ రచించిన భవిష్య మాలిక వంటి గ్రంథాలు రాబోయే వినాశనం గురించి వెన్నులో వణుకు పుట్టించే విషయాలను వివరించాయి.
ఆరున్నరేళ్ల మహాయుద్ధం
భవిష్య మాలిక ప్రకారం.. ప్రపంచం త్వరలోనే ఒక భయంకరమైన మూడవ ప్రపంచ యుద్ధాన్ని చూడబోతుంది. ఇది ఆరున్నర ఏళ్ల పాటు సాగుతుందని, దీనివల్ల ప్రపంచంలో సగానికి పైగా జనాభా అంతమైపోతుందని హెచ్చరిస్తున్నాయి. యుద్ధ సమయంలో ఆకాశంలో రెండు సూర్యులు కనిపిస్తారని, గాలి విషపూరితంగా మారుతుందని ప్రవచనాలు చెబుతున్నాయి. చైనా, పాక్ వంటి దేశాలతో భారత్ తలపడతుందని అందులో ఉంది. ఇక అగ్రరాజ్యాలైన అమెరికా, ఐరోపా దేశాలు ఈ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, భారత్ మాత్రం ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడుతుందని, ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా మారుతుందని కాలజ్ఞానం చెబుతోంది.
కల్కి ఆగమనం.. అజ్ఞాతంలో దేవుడు..?
కల్కి ఇప్పటికే జన్మించాడని, ప్రస్తుతం ఆయన ఒక రహస్య ప్రదేశంలో అజ్ఞాతంగా పెరుగుతున్నాడని చాలామంది నమ్ముతారు. అన్యాయం పరాకాష్టకు చేరినప్పుడు ఆయన ప్రపంచానికి తన ఉనికిని తెలియజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, చేతిలో మెరిసే కత్తితో దుష్ట శక్తులను సంహరించే వీరుడిగా కల్కిని వర్ణిస్తారు. కంచి పీఠం లేదా జగన్నాథ ఆలయం వంటి పవిత్ర క్షేత్రాల్లో ఊహించని మార్పులు సంభవించినప్పుడు కల్కి వచ్చే సమయం ఆసన్నమైందని మనం గుర్తించాలని బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు.
సత్యయుగం ప్రారంభం
ఈ భయంకరమైన యుద్ధం, వినాశనం తర్వాత మళ్లీ మంచి రోజులు వస్తాయి. దాన్నే సత్యయుగం లేదా స్వర్ణయుగం అంటారు. ఈ కొత్త కాలంలో కేవలం సత్యం, ధర్మం పాటించేవారు మాత్రమే జీవిస్తారు. కులమత బేధాలు ఉండవు, ప్రపంచమంతా ఒక్కటే అన్నట్లుగా ఉంటుంది. రోగాలు లేని, కష్టాలు లేని ప్రశాంతమైన జీవితం మానవులకు లభిస్తుంది. కాగా వినాశనం అనేది కేవలం ఒక మార్పు మాత్రమే. చెడును అంతం చేసి, మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడమే కల్కి అవతారం ముఖ్య ఉద్దేశం. అందుకే మంచి దారిలో నడిచేవారికి భయం లేదని, కేవలం అన్యాయం చేసేవారే భయపడాలని ఈ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి.