Reading Time: < 1 minute
పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య

ఇంట్లో జరిగే చిన్న చిన్న మాటలు ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తాయో గుర్తు చేసే ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పరిధిలోని శంషిగూడలో, భర్త సరదాగా అన్న మాటను మనసులో పెట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం స్థానికంగా ఆందోళన కలిగించింది.

శంషిగూడకు చెందిన శివకుమార్, రాజేశ్వరి దంపతులు మాములుగా హ్యపీగానే ఉంటున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ చిన్న సంఘటన వారి జీవితంలో కలకలం రేపింది. భార్య ఆరోగ్యంపై శ్రద్ధతో మాట్లాడిన భర్త మాట.. అనుకోని మలుపు తీసుకుంది.

రాజేశ్వరి సన్నగా ఉండటంతో, ఆమె ఆరోగ్యం మెరుగుపడాలనే ఉద్దేశంతో శివకుమార్ “కొంచెం పెరుగు తింటే బాగుంటుంది” అని చెప్పాడు. అయితే ఆ వ్యాఖ్యను రాజేశ్వరి భిన్నంగా అర్థం చేసుకుని తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. తనను అవమానించినట్లుగా భావించిన ఆమె.. ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.

సాయంత్రం నుంచి రాత్రి దాకా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త.. మొదటగా బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికాడు. అయినప్పటికీ ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ.. ఆమె ఎటు వెళ్లిందన్న దిశగా వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో కుటుంబాల్లో మాటల ప్రాముఖ్యత మరోసారి వెలుగులోకి వచ్చింది. చిన్న విషయాలను పెద్దగా తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.