
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ యువకుడు ఏకంగా 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్చల్ చేశాడు. విద్యుత్ స్తంభంపై యువకుడిని చూసిన స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. సినిమాలను తలపించేలా సాగిన ఈ హైడ్రామా చివరికి సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు గతంలో విద్యుత్ శాఖలో లైన్మ్యాన్గా విధులు నిర్వహించేవాడు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా పై అధికారులు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు, గ్రామంలోని విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. లైన్మ్యాన్గా అనుభవం ఉండటంతో వేగంగా పైకి ఎక్కి వైర్ల మధ్య ప్రమాదకరంగా కదులుతూ కనిపించాడు. అది చూసి హడలిపోయిన స్థానికులు వెంటనే విద్యుత్శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ఆ లైన్ పరిధిలో సరఫరాను నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. అనంతరం ఎలక్ట్రికల్ సిబ్బంది చాకచక్యంగా స్తంభంపైకి ఎక్కి, యువకుడికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. కిందకు దించిన వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉపాధి కోల్పోయానన్న ఆవేదనతోనే తన కుమారుడు ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: