
Kangana Ranaut: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజు కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ గౌరవాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
చిన్ననాటి కథలు చెబుతున్నారు..
ఈ సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రసంగంపై విరుచుకుపడ్డారు. “రాహుల్ గాంధీ మాటలు వినడం తలనొప్పిగా అనిపిస్తోంది. ఆయన పార్లమెంట్లో తన చిన్ననాటి కథలు, ఇంద్రజాల ప్రదర్శనల గురించి చెబుతున్నారు. ఎవరో మాంత్రికుడు తనను గొలుసులతో బంధించాడని, రాత్రిపూట వణుకు వచ్చేదని అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. స్పీకర్ ఆపమని చెప్పినా వినకుండా, ‘మీరు ఆస్వాదించాలి’ అంటూ అనవసర ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన పార్లమెంట్ భవనాన్ని ఒక అపహాస్యంగా మార్చేశారు” అని కంగనా విమర్శించారు.
అంతకుముందు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. “ఇది మహిళా సాధికారత కోసం తెచ్చిన బిల్లు కాదు. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనది. వారి హక్కులను హరించడమే ప్రభుత్వ లక్ష్యం. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో చేసినట్లుగానే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది” అని ఆరోపించారు. ఈ చట్టం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, ఓబీసీల హక్కులను కాపాడటమే తన ప్రాధాన్యతని రాహుల్ పేర్కొన్నారు. “ప్రభుత్వం అధికారం కోసం ఇలాంటి సిగ్గుచేటైన చట్టాలను తీసుకువస్తోంది. పాత చట్టాన్ని పునరుద్ధరిస్తేనే తమ మద్దతు ఉంటుంది తప్ప, ఈ కొత్త బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై ఉభయ సభల్లోనూ గందరగోళం కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.