Reading Time: 2 minutes
Japan Rising Anti Muslim Sentiment Mosque Growth Political Debate 2026

Muslim Population: జపాన్ అంటే క్రమశిక్షణకు, సంస్కృతికి మారుపేరుగా చెబుతుంటారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం జపాన్. అయితే, ఇటీవలి కాలంలో అక్కడ ముస్లిం వ్యతిరేక భావజాలం బలంగా వినిపిస్తోంది. ఆ దేశంలో గడిచిన కొన్నేళ్లలో భారీగా మజీదులు భారీగా పెరిగాయట. మొదట్లో కేవలం నాలుగు మజీదులు ఉండగా.. చివరకు 160కు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘మసీదుల నిర్మాణం’, ‘కబరస్థాన్ల ఏర్పాటు’ వంటి అంశాలు ప్రధాన ఎన్నికల అజెండాలుగా మారడం గందరగోళంగా మారింది. టోక్యో సమీపంలోని యోకోహామా, ఫుజిసావా వంటి ప్రాంతాల్లో మసీదుల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. జనవరి 29న ఫుజిసావా స్టేషన్ వెలుపల ఒక స్వతంత్ర అభ్యర్థి చేసిన ప్రసంగం దీనికి ఆజ్యం పోసింది. మసీదుల నిర్మాణం వల్ల జపాన్ సాంస్కృతిక అస్తిత్వం దెబ్బతింటుందని, స్థానిక ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వస్తున్న ప్రచారం జపాన్ ప్రజల్లో ఇన్ సెక్యూరిటీని పెంచుతోంది. జపాన్ ప్రజల ఆందోళనకు ప్రధాన కారణం.. ఒక దశాబ్ద కాలంలోనే ముస్లిం జనాభా అనూహ్యంగా పెరగడమే అని చెబుతున్నారు. 2010 జనాభా లెక్కల ప్రకారం.. జపాన్‌లో కేవలం 1,10,000గా ఉన్న ముస్లింల సంఖ్య, 2024 నాటికి సుమారు 4,20,000కు చేరిందని నిపుణుడు హిరోఫుమి తనడా అంచనా వేశారు. అంటే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇక 1980లో కేవలం 4 మసీదులు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 160కి చేరిందట. దాదాపు 54,000 మంది జపనీయులు ఇస్లాం మతాన్ని స్వీకరించడం కూడా స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది.

READ MORE: Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?

జపాన్ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైన సనా తకైచీ, ఆమె పార్టీ అనుసరిస్తున్న మితవాద (Right-wing) విధానాలు ఈ పరిస్థితిని మరింత ప్రభావితం చేస్తున్నాయి. జపాన్‌లో విదేశీ జనాభా పెరగడం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తకైచీ సమర్థవంతంగా వినియోగించుకున్నారు. జనవరిలో ఆమె ప్రభుత్వం పౌరసత్వం, శాశ్వత నివాసానికి (PR) సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. బకాయిలు ఉన్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో ‘హలాల్ ఫుడ్’ అందించాలనే ప్రతిపాదనలపై వేలాది ఫిర్యాదులు రావడం, జపాన్ మూల సంస్కృతిని కాపాడుకోవాలనే తపన జపనీయుల్లో తీవ్రమైంది. తగ్గుతున్న జననాల రేటు కారణంగా జపాన్‌కు విదేశీ కార్మికుల అవసరం ఉన్నప్పటికీ, పెరుగుతున్న విదేశీ జనాభా తమ సంస్కృతిని మార్చేస్తోందన్న భయం జపనీయులను వెంటాడుతోంది. ముఖ్యంగా ఇండోనేషియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వస్తున్న వలసదారుల సంఖ్య పెరగడం, మసీదుల నిర్మాణం ద్వారా అది ఒక భౌగోళిక మార్పుకు దారితీస్తోందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఈ ‘కల్చరల్ క్లాష్’ ఇప్పుడు జపాన్ రాజకీయాలను శాసిస్తోంది.