Reading Time: 2 minutes
Tcs Nashik Case Sit Probes Bank Accounts Of Accused In New Twist

TCS Nashik Case: నాసిక్‌లోని టీసీఎస్ బీపీఓ కేంద్రంలో వెలుగులోకి వచ్చిన వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాల కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు వ్యక్తిగత ఆరోపణల దశలో ఉన్న ఈ కేసు ఇప్పుడు ఆర్థిక లావాదేవీల దర్యాప్తు దశకు చేరుకుంది. నిందితులకు జీతాలతో పాటు ఇతర మార్గాల నుంచి నిధులు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ సహా ఇతర నిందితుల బ్యాంక్ ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వారి జీతాల వివరాలు, ఖాతాలో జరిగిన లావాదేవీలు, బాహ్య వనరుల నుంచి డబ్బు జమైందా అనే అంశాలపై బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం కోరినట్లు తెలుస్తోంది.

వ్యవస్థీకృత నెట్‌వర్క్ ఉందా?
ఈ ఘటన వెనుక వ్యక్తిగత స్థాయి చర్యలేనా, లేక వ్యవస్థీకృత నెట్‌వర్క్ పనిచేసిందా అనే అంశంపై SIT దృష్టి సారించింది. జీతం కాకుండా ఇతర మార్గాల నుంచి నిధులు వచ్చినట్లు ఆధారాలు లభిస్తే కేసు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. టీమ్ లీడర్లు, ఇతర ఉద్యోగుల ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నిదా ఖాన్ పాత్రను కీలకంగా భావిస్తున్నారు. ఆమె కేవలం హెచ్‌ఆర్ బాధ్యతల్లోనే కాకుండా, మొత్తం వ్యవహారంలో చురుకైన పాత్ర పోషించిందనే ఆరోపణలు ఉన్నాయి.

నిదా ఖాన్ పరారీలోనే
ఈ కేసు నమోదైనప్పటి నుంచి నిదా ఖాన్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. మహిళా ఉద్యోగుల ఫిర్యాదులను పట్టించుకోకుండా, నిందితులకు మద్దతు ఇచ్చారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు పోలీసులు టీసీఎస్‌కు చెందిన ఏడుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ తదితరులు అరెస్టైన వారిలో ఉన్నారు. వీరిపై మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మతపరమైన ఒత్తిడి, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలు వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ వీరిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.

మహిళా ఉద్యోగుల ఫిర్యాదులతో వెలుగులోకి
ఈ కేసు మొత్తం ఎనిమిది మంది మహిళా ఉద్యోగుల ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది. మానసిక, లైంగిక వేధింపులకు గురయ్యామని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదులు హెచ్‌ఆర్ విభాగానికి వెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా కొందరు ఉద్యోగులను ప్రార్థనలు చేయమని, మాంసాహారం తినమని, మత చిహ్నాలు ధరించమని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక మహిళను టోపీ ధరింపజేసి ఫోటోలు తీసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

కంపెనీ స్పందన
ఈ ఘటనపై టీసీఎస్ స్పందిస్తూ, కార్యాలయంలో ఎలాంటి వేధింపులు, బలవంతాలకు తాము సహనం చూపబోమని స్పష్టం చేసింది. నిందితులను సస్పెండ్ చేసి, అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిపింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ ఘటనను తీవ్రమైనదిగా అభివర్ణించగా, టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణియన్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.