
- మెజారిటీ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- 2 డిగ్రీలు పెరిగి 44 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- వడదెబ్బ చికిత్సకు ప్రత్యేక టీమ్: మంత్రి దామోదర
- స్కూళ్లలో వాటర్ బెట్ కొట్టండి: రెవెన్యూ డిపార్ట్మెంట్
- జాగ్రత్తలు చెబుతూ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ
- మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు బయటకు రావొద్దని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నయ్. రోహిణి కార్తె రాకముందే ఎండలు నిప్పుల కుంపటిలా సెగలు కక్కుతున్నయ్. రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తోడు వడగాల్పులు కూడా వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ‘డైలీ సమ్మర్ హెల్త్ బులెటిన్’ విడుదల చేసి, పలు జాగ్రత్తలను సూచించింది.
- 41 నుంచి 44 డిగ్రీలు
రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం,కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబబాద్, ములుగు, సూర్యపేట్, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. హైదరాబాద్తో పాటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.
- ఎండ చికిత్సకు ప్రత్యేక టీమ్
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు ప్రతి హాస్పిటల్ లో స్పెషల్ డెడికేటెడ్ టీమ్ సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాస్పిటళ్లలో రోగులు, వారి అటెండెంట్లు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వేసవిలో అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని, కావున అన్ని హాస్పిటల్స్ లో పవర్ కేబుల్స్ తనిఖీ చేసి, ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలనిఅధికారులను ఆదేశించారు.
- స్కూళ్లలో వాటర్ బెల్ కొట్టండి:
రెవెన్యూ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రెవెన్యూ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41-నుంచి 44 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నందున, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బహిరంగ పనులను నిలిపివేయాలని, స్కూళ్లలో వాటర్ బెల్స్ ఏర్పాటు చేసి అంగన్ వాడీలను ఉదయం 11 గంటలకే ముగించాలని సూచించింది. మూగజీవాల కోసం నీటి కుంటలు, నీడ ఏర్పాటు చేయాలని, అలాగే అగ్నిప్రమాదాల నివారణకు కమర్షియల్ బిల్డింగుల్లో ఫైర్ ఆడిట్లు నిర్వహించాలని సర్క్యులర్ జారీ చేసింది.
- వడదెబ్బ తగిలితే డేంజరే…
ఎండలు, వడగాల్పులు హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. తీవ్రమైన జ్వరం, వాంతులు, వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, కండరాలు పట్టేయడం, వేగంగా గుండె కొట్టుకోవడం, ఊపిరి ఆడకపోవడం వడదెబ్బ లక్షణాలని, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని, లేదంటే108 కి ఫోన్ చేసి దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్లాలని పేర్కొంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
- మండిపోనున్న ఎండలు..
రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎండ తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం,కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబబాద్, ములుగు, సూర్యపేట్, సిరిసిల్ల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. అలాగే, హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది.