
క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్. ఇవాళ( ఏప్రిల్ 13) ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7 :30 గంటలకు హోరాహోరీ పోరు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉప్పల్ స్టేడియం నుంచి తిరిగి వెళ్లే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా మెట్రో సేవలను అర్ధరాత్రి 12:00 గంటల వరకు పొడిగించింది. సాయంత్రం వేళల్లో ఉండే భారీ ట్రాఫిక్ జామ్లను దృష్టిలో ఉంచుకుని అభిమానులందరూ మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అన్ని కారిడార్ల నుంచి ప్రయాణికులు ఉప్పల్ ,ఎన్జీఆర్ఐ (NGRI) మెట్రో స్టేషన్ల ద్వారా స్టేడియానికి చేరుకోవచ్చని సూచించింది.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్నేపథ్యంలో ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టారు. నాగోల్ నుంచి హబ్సిగూడ (ఉప్పల జంక్షన్ వరకు ), బోడుప్పల్ నుంచి అంబర్ పేట్ (ఉప్పల్ జంక్షన్ , రామాంతపూర్ మార్గం) వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడితే ఇబ్బందులు ఉండవన్నారు. లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంసీ వెహికల్స్, జేసీబీలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్లు డైవర్షన్ రూట్లలోనే వెళ్లాలన్నారు.