Reading Time: < 1 minute
Kanchikacherla Yolo Travels Bus Accident 36 Passengers

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ఆదివారం ఉదయం ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. జాతీయ రహదారిపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న డీసీఎం లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ‘యోలో’ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ఎడమవైపు భాగం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, విండ్‌షీల్డ్, కిటికీ అద్దాలు నుజ్జునుజ్జయ్యాయి. అద్దాల పెంకులు గుచ్చుకోవడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.