Reading Time: 3 minutes
Ntv Story Board Over Jobs

దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాలు నానాటికీ వివాదాస్పదం అవుతున్నాయి. కోటి ఆశలతో పరీక్షలు రాసే నిరుద్యోగులకు.. చివరకు పేపర్ లీకులు, కోర్టు కేసులతో ఉద్యోగాల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పటం లేదు. స్థిరమైన రిక్రూట్‌మెంట్ పాలసీ లేక రాష్ట్రాల్లో రిక్రూట్‌మెంట్లన్నీ అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. ఓవైపు యూపీఎస్సీ, ఎస్సెస్సీ పరీక్షలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. వివాదాలు కూడా తక్కువే. కానీ రాష్ట్రాల్లో మాత్రం ఉద్యోగాలతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రభుత్వాల ఆలోచనే అసలుకే మోసం తెస్తోంది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఆ పరీక్ష… ఈ పరీక్ష అనే భేదం లేదు. వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ నియామక పరీక్షలు సమస్యల పుట్టగా మారాయి. కచ్చితమైన రిక్రూట్‌మెంట్‌ పాలసీలు లేక.. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ లబ్ధి ఆలోచనలు జతచేరి.. వ్యవస్థను మరింతగా భ్రష్టు పట్టిస్తున్నాయి.

గ్రూప్-1, 2, 4, టీచర్ రిక్రూట్‌మెంట్, పోలీస్ నియామకాలు.. ఇలా పేరేదైనా కానీ.. ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీపరీక్షలు. ప్రతి రాష్ట్రంలో ఈ ఉద్యోగాల నియామకాల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కొలువుదీరాయి. వాటి విధి నిర్వహణకు ప్రత్యేకమైన చట్టాలున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. రిక్రూట్‌మెంట్‌కు అసలు ఓ విధానం అంటూ లేకుండా పోవడం.. ఉద్యోగార్ధుల సహనానికి అడుగడుగునా పరీక్ష పెడుతోంది. ఒక్కో పరీక్షను ఒక్కో రకంగా నిర్వహిస్తున్నస్టేట్ పీఎస్సీలు.. నోటిఫికేషన్ ప్రకారం రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేస్తే గొప్పే అనుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచీ.. పోస్టింగులు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి దశలోనూ కోర్టు కేసులు పడటం మామూలే. ప్రతి నోటిఫికేషన్‌కు ముందు న్యాయవివాదాలు రాకుండా జాగ్రత్తపడుతున్నామని చెప్పినా.. ఏ పరీక్ష చూసినా ఏమున్నది గర్వకారణం అనుకోవాల్సింది. పోనీ రిక్రూట్‌మెంట్ విధానమైనా లోపాల్లేకుండా ఉంటుందా.. అస్సలు ఉండదు. కావాల్సినన్ని వివాదాలు, సమస్యలతో కునారిల్లుతున్న స్టేట్ పీఎస్సీలు.. ఉద్యోగ నియామకాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా పేపర్ లీకేజీలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అనే తేడా ఏం లేదు. అలాగే అది ఏ పరీక్షో కూడా అనవసరం. ఎలాగోలా పేపర్ లీకేజీకి ప్రయత్నాలు చేయడం.. అదీ కాదంటే తెరవెనుక అక్రమాలు చేయడం.. స్టేట్ పీఎస్సీల్లో కొందరు సిబ్బందికి బాగా అలవాటైన విద్య. అందుక ఏటా ఉద్యోగాలు రాలేదనే నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులు కనిపిస్తూనే ఉన్నారు. ఓ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్‌మెంట్ పై రగడ జరిగితే.. మరో రాష్ట్రంలో ఏకంగా పోలీస్ రిక్రూట్‌మెంటే వివాదాస్పదమౌతోంది. ఇక గ్రూప్‌ -1, 2, 4 లాంటి పరీక్షల్లో వచ్చే సమస్యలు, లోపభూయిష్ట విధానాలు వేరే లెవల్ అనే చెప్పాలి. నిరుద్యోగులకు ఏ ఉద్యోగాలపై క్రేజ్ ఉంటే.. అందుకు తగ్గట్టుగా సమస్యలు క్రియేట్ చేయడంలో కొన్ని బ్యాచులు ఆరితేరాయి. ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన స్టేట్ పీఎస్సీలు.. రాజకీయ లబ్ధి ఆలోచనల్లో మునిగిపోయి.. బాధ్యతను గాలికొదిలేస్తున్నాయి. దీంతో చివరకు నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు.

అసలు ఉద్యోగార్హతల ప్రకటన దగ్గర్నుంచీ వివాదాల తంతు మొదలవుతుంది. ఒకే ఉద్యోగానికి కూడా ఒకే విధమైన పాలసీ లేకుండా.. నోటిఫికేషన్‌ కు ఓ రకంగా వ్యవహరించడంలో స్టేట్ పీఎస్సీలు ఆరితేరాయి. ఆ తర్వాత రిజర్వేషన్ల వివాదాలు రాస్తే పెద్ద భారతం అవుతుంది. రిజర్వేషన్ల విషయంలో ఎలా వ్యవహరించాలో స్పష్టమైన నిబంధనలున్నా.. రాష్ట్రస్థాయి నియమకాల్లో మాత్రం ఉద్దేశపూర్వకంగా అస్పష్టతను కొనితెస్తారు. తద్వారా అందర్నీ గందరగోళానికి గురిచేస్తారు. అలాగే పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ సమస్యలకు తెరతీస్తారు. ఇది చాలదన్నట్టు ఇంటర్వ్యూల్లో నడిచే బాగోతానికి వేరే కథ. ఈ ఇంటర్వ్యూల గోల పడలేక కొన్ని ఉద్యోగాలకు కేవలం రాత పరీక్షలే పెడుతున్నారు. చివరకు ఈ మార్పును కూడా అదనుగా తీసుకుని.. విచ్చలవిడిగా వివాదాలు కొనితెస్తున్నారు. అంతిమంగా ఉద్యోగ నియామక పరీక్షల్నే అపహాస్యం చేస్తున్నారు.

నిజానికి ఏ ఉద్యోగ నియామకానికైనా నిర్దిష్టమైన పాలసీ ఉండాలి. కేవలం పరీక్షల నిర్వహణ కోసమే ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఉన్నప్పుడు.. కచ్చితమైన పాలసీ తీసుకురావడం, అమలు చేయడం రెండూ కష్ట కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతసేపూ ఉద్యోగ నియామకాల నుంచి రాజకీయ లబ్ధి పొందే యావే తప్ప.. రిక్రూట్‌మెంట్ సక్రమంగా చేయాలనే చిత్తశుద్ధి కరవౌతోంది. అసలు ఉద్యోగ నియమకాల్లో అవకతవకలకు ఇదే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. ఏమాటకామాటే.. ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా.. ఉద్యోగ నియామకాల్లో సంస్కరణలు తెస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, యూపీఎస్సీ తరహాలో పరీక్షలు పెడతామని అన్ని పార్టీలూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏ సర్కారు ఉన్నా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఎందుకంటే టీచర్ ఉద్యోగం ఇచ్చి.. ప్రజాసేవ అని చెప్పుుకునే పార్టీలున్నాయి. అలాగే గ్రూప్‌-1 పరీక్ష పెట్టడమే రాష్ట్ర ప్రజలకు మహోపకారం అని భావించే నేతలున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాష్ట్రస్థాయి ఉద్యోగనియామకాలు సజావుగా ఎలా జరుగుతాయనేది అసలు ప్రశ్న.

ఇక్కడ మిగతా ఉద్యోగ నియామకాల గురించి పక్కనపెడితే.. టీచర్ల రిక్రూట్‌మెంట్‌ విషయంలో జరుగుతున్న బాగోతం వేరే లెవల్. దేశ భవిష్యత్తు పౌరుల్ని తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత ఉన్న ఉద్యోగాల విషయంలో కూడా సరైన పాలసీ లేకుండా జరుగుతున్న నియామకాలు.. వివిధ రాష్ట్రాల్లో గగ్గోలుకు కారణమౌతున్నాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా కలవరపడేస్థాయిలో టీచర్ల రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థను వివిధ రాష్ట్రాలు భ్రష్టు పట్టించిన వైనం కళ్ల ముందే కనిపిస్తోంది. ఓవైపు నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లపై ఆశలు పెట్టుకుని.. ఏళ్ల తరబడి రాష్ట్రాల రాజధానుల్లో తిష్ట వేసి.. ఆస్తులమ్మేసి మరీ ప్రిపేరవుతుంటారు. అప్పటికీ ప్రభుత్వాలకు తమ బాధ్యత గుర్తుచేస్తూ.. ఎన్నో పోరాటాలు చేస్తే కానీ.. నోటిఫికేషన్లు రావు. తీరా నోటిఫికేషన్లు వచ్చాక అన్ని సమస్యల్నీ దాటుకుని ఉద్యోగం తెచ్చుకోవడం అంటే.. వైతరణీ నది దాటి.. నరకానికి చేరడం కంటే కష్టం అని ఒప్పుకోక తప్పదు. ఈ స్థాయిలో నిరుద్యోగుల్ని వేపుకుతింటున్న రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు.. ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేస్తూ.. మొత్తంగా రిక్రూట్‌మెంట్‌ వ్యవస్థనే మేడిపండు చందం చేసేశాయి.