
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన పార్టీ తెలంగాణ శంఖారావం సభ నిర్వహించనుంది. ఖమ్మంలోని MB గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మంకు తరలిరానున్నారు. పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంతో పాటు తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని బలోపేతం చేయడమే ఈ సభ ప్రధాన లక్ష్యంగా జనసేన నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై సభలో చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజల సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఈ శంఖారావం సభ కీలకంగా మారుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను ఏకం చేసి ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయడానికి అవసరమైన కార్యాచరణను ఈ సభ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది.