ఉదయం నిద్రలేచి మంచం దిగి మొదటి అడుగు వేయగానే మడమ కింద తీవ్రమైన నొప్పి వస్తోందా? లేదా కాసేపు కుర్చీలో కూర్చుని లేచి నిలబడినప్పుడు పాదాలు నేలపై పెట్టలేకపోతున్నారా? అయితే మీరు ప్లాంటార్ ఫాసైటిస్ లేదా మడమ ఎముక పెరిగే సమస్యతో బాధపడుతున్నట్లే. మన అనునిత్య జీవితంలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించే ఈ మడమ నొప్పులకు అసలు కారణాలు ఏంటి? దీనికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మడమ నొప్పికి ప్రధాన కారణాలు: పాదాల కింద ఉండే ఫాసియా అనే కణజాలం వాపునకు గురికావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఇక అధిక బరువు ఉండటం వల్ల మడమలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అలాగే రోజంతా గట్టి నేలపై నిలబడి పనిచేయడం, ఫ్లాట్గా లేదా గట్టిగా ఉండే చెప్పులు ధరించడం మరియు శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపించడం వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది.

ఇంట్లోనే పాటించాల్సిన ఐస్ బాటిల్ చిట్కా: మడమ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఐస్ మసాజ్ బాగా పనిచేస్తుంది. ఒక చిన్న ప్లాస్టిక్ సీసాలో నీళ్లు పోసి ఫ్రీజర్లో గడ్డకట్టనివ్వాలి. ఇక ఆ బాటిల్ను నేలపై ఉంచి, దానిపై పాదాన్ని ఉంచి ముందుకు, వెనక్కు 10-15 నిమిషాల పాటు దొర్లిస్తే వాపు, నొప్పి తగ్గుతాయి.
స్ట్రెచింగ్ & ఎప్సమ్ సాల్ట్ నీటి చికిత్స: ఉదయాన్నే మంచం దిగడానికి ముందే పాదాలను, కాలి వేళ్లను ముందుకు, వెనక్కి సాగదీయడం (స్ట్రెచింగ్) అలవాటు చేసుకోవాలి. ఇక అలాగే ఒక టబ్లో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి 15 నిమిషాల పాటు పాదాలను ఉంచితే కండరాల బిగుతు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
సరైన పాదరక్షల ఎంపిక: ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కాళ్లతో నడవకూడదు. మెత్తటి కుషన్ కలిగిన ఎంసీఆర్ చెప్పులను ధరించడం వల్ల మడమలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
మడమ నొప్పిని ప్రారంభంలోనే గుర్తించి చిన్న చిన్న జాగ్రత్తలు, స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు పాటించడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు.
గమనిక: ఈ జాగ్రత్తలు, పరిహారాలు పాటించినప్పటికీ నొప్పి 2 నుంచి 3 వారాలకు పైగా నిరంతరం వేధిస్తుంటే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఒక ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించి సలహా పొందడం శ్రేయస్కరం.
The post మడమ నొప్పి తరచూ వేధిస్తోందా..? దాని వెనుక కారణాలు ఇవే కావచ్చు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.