Reading Time: 2 minutes
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో ఏముందో చూసి షాక్!

ఆన్‌లైన్ షాపింగ్ వస్తువులను కొనడాన్ని చాలా సులభతరం చేసింది. మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఇంటి నుండే ఆర్డర్ చేయండి.. కొన్ని రోజుల్లోనే వస్తువులను మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి. కానీ, ఈ సౌలభ్యంతో పాటు, ఆన్‌లైన్ మోసాల కేసులు కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది?

గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక వినియోగదారుడు ఒక ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా తన ఇంటి కోసం ఆండ్రాయిడ్ టీవీ పరికరాన్ని ఆర్డర్ చేశాడు. అనుకున్న సమయానికి డెలివరీ ఏజెంట్ వచ్చి పార్శిల్‌ను అందజేశాడు. తీరా ఎంతో ఆత్రుతగా ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూసిన సదరు వ్యక్తికి మైండ్ బ్లాంక్ అయింది. అందులో తాను ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరం స్థానంలో ఆవు పేడతో తయారు చేసిన ఎరువు ప్యాకెట్ ప్రత్యక్షమైంది.

బాక్స్ లోపల ఉన్న పేడ ఎరువు ప్యాకెట్‌ను చూసి బాధితుడు తీవ్ర ఆగ్రహానికి, నిరాశకు గురయ్యాడు. వెంటనే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తూ ఇ-కామర్స్ సంస్థ నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు సదరు కంపెనీ సేవలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఆర్డర్లు ప్యాక్ చేసే సమయంలో లేదా డెలివరీ ప్రాసెస్ మధ్యలో వస్తువులు మాయమై ఇలాంటి నకిలీ లేదా పనికిరాని వస్తువులను పెడుతున్నారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షాపింగ్ చేసేటప్పుడు ప్రతీ ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

డెలివరీ తీసుకునే సమయంలోనే ప్యాకింగ్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. వీలైతే డెలివరీ బాయ్ ముందే ప్యాకెట్ ఓపెన్ చేస్తూ అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయడం మంచిది. ఇది బాధితులకు బలమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. ఈ ఘటనపై బాధితుడు సదరు ఇ-కామర్స్ సంస్థ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయగా, వారు రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..