
కాబూల్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో తలదాచుకున్నాడంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనలను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మసూద్ అజార్ ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో లేడని ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి స్పష్టం చేశారు. అంతేకాకుండా, తమ గడ్డను ఏ ఇతర దేశంపై ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కాబూల్ మరోసారి తేల్చిచెప్పింది.
భారత్లో జరిగిన పలు భీకర ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారిగా ఉన్న మసూద్ అజార్ కోసం అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా గాలిస్తున్నాయి. అయితే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురైన ప్రతిసారీ, అజార్ అఫ్గానిస్తాన్కు పారిపోయాడంటూ పాకిస్తాన్ కొత్త వాదనను తెరపైకి తెస్తూ వస్తోంది. ఉగ్రవాద నిధుల కట్టడిలో విఫలమవడం వల్ల గతంలో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో ఉండిపోయిన పాక్.. ఆ జాబితా నుంచి బయటపడేందుకు అజార్ను అరెస్టు చేస్తామని అంతర్జాతీయ వేదికలపై హామీ ఇచ్చింది.