Reading Time: 2 minutes
IND vs BAN: నేడే భారత్ vs బంగ్లాదేశ్ సెమీఫైనల్.. మ్యాచ్ ఎప్పుడు, ఏ ఛానెల్‌లో చూడొచ్చంటే?

IND vs BAN: మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు జరగనున్న తొలి సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ తరహాలో దూసుకెళ్తున్న భారత జట్టు, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ ఉత్కంఠభరిత పోరు ఎప్పుడు ప్రారంభమవుతుంది, టీవీ, ఓటీటీలలో ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చో వివరంగా తెలుసుకుందాం. మహిళల ఆసియా టోర్నీలో భారత జట్టు సుదీర్ఘ కాలంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 2004లో ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిసారీ ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టుగా మన మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ సారి కూడా అదే విజయపరంపరను కొనసాగిస్తూ ఎనిమిదోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ప్రతీకారం తీర్చుకునేందుకు సరైన అవకాశం

ఈ మ్యాచ్ కేవలం ఫైనల్ బెర్త్ కోసం మాత్రమే కాదు, పాత బకాయిలు తీర్చుకోవడానికి కూడా టీమిండియాకు మంచి అవకాశం. 2018 ఆసియా కప్ ఫైనల్లో భారత్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్, తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. అందుకే ప్రత్యర్థిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్‌లు జరగగా, భారత్ 21 సార్లు విజయం సాధించగా, బంగ్లాదేశ్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన చివరి పోరులో కూడా టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రెండు జట్ల ప్రయాణం ఇలా

ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా సెమీస్ దాకా వచ్చింది. గ్రూప్-ఎ లో పాకిస్థాన్, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌లను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గ్రూప్-బి లో ఉన్న బంగ్లాదేశ్ ఇండోనేషియా, యూఏఈలపై గెలిచి, శ్రీలంక చేతిలో ఓటమి పాలై రెండో స్థానంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఈ ఉత్కంఠభరిత పోరును టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. మొబైల్, డిజిటల్ యూజర్లు సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. అలాగే సెప్టెంబర్ 11న జరగనున్న రెండో సెమీఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..