Reading Time: 2 minutes
ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడికి 25 ఏళ్లు.. భారత ప్రధాని మోదీ ఏమన్నారంటే?

అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన భయానక ఉగ్రవాద దాడులకు నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొందని పేర్కొన్నారు. భారత్‌ దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉంటూనే, ఉగ్రవాదంపై పోరాటంలో దృఢంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాద ముప్పు కొనసాగుతున్నప్పటికీ, అన్ని రూపాల్లోని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సంకల్పం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.

2014లో తాను సందర్శించిన 9/11 స్మారక, మ్యూజియంకు సంబంధించిన చిత్రాలను కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక 2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. రెండు విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టడంతో భవనాలు కూలిపోయాయి. మరో విమానం వర్జీనియాలోని పెంటగాన్‌ను ఢీకొట్టింది. నాలుగో విమానం ప్రయాణికుల ప్రతిఘటనతో పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఈ దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారిగా ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా గుర్తించింది. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..