Reading Time: 2 minutes
Ys Jagan Alleges Dsc Scam Over 372 Sports Quota Jobs

YS Jagan: డీఎస్సీ-2025లో అక్రమాలపై వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన నిబంధనలను మార్చి, పరీక్ష కూడా రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఇందుకోసం జీవో నంబర్‌ 4, 47 తీసుకువచ్చి, ఆ తర్వాత జీవో నంబర్‌ 23, 25, 56 ద్వారా నిబంధనలను మార్చి మళ్లీ గేట్లు మూసేశారని విమర్శించారు.

372 ఉద్యోగాలపై జగన్ ప్రశ్నలు
స్పోర్ట్స్ కోటాలో 372 మందిని తీసుకునేలా జీవోలు ఎందుకు తీసుకువచ్చారని జగన్ ప్రశ్నించారు. ఆ తర్వాత వాటిని ఎందుకు ఉపసంహరించుకున్నారని నిలదీశారు. నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునే విధంగా జీవోలు తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియోలు, వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కేసును ఎందుకు నిర్వీర్యం చేశారని జగన్ ప్రశ్నించారు. బయటకు వచ్చిన వీడియోలో ఫోన్ నంబర్ కూడా స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ ఫోన్ నంబర్ ఎవరిదో గుర్తించడం పోలీసులకు కష్టమా అని ప్రశ్నించారు.

ఎఫ్‌ఐఆర్‌లో ‘సస్పెక్ట్’గా ఎందుకు?
ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నేరుగా ప్రస్తావించకుండా ‘సస్పెక్ట్’గా ఎందుకు పేర్కొన్నారని జగన్ నిలదీశారు. రిమాండ్‌కు పంపామని అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ చెప్పారని, కానీ వాస్తవంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ఆరోపించారు. కేసును దగ్గరుండి నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇక, చంద్రబాబు, లోకేష్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని జగన్ ఆరోపించారు. తాను చెబుతున్న విషయాలు ఆరేళ్ల పిల్లాడికి కూడా అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు, ఆయన కుమారుడు తప్పు చేసిన వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

‘లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు’
తప్పులు చేసి వాటిని బుల్డోజ్‌ చేస్తూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని జగన్ ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలకు తాను అడిగిన నాలుగు ప్రశ్నలే పునాది అని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే తవ్వేకొద్దీ మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. డీఎస్సీ వ్యవహారంలో పైనుంచి ఆదేశాలు ఇచ్చి, అవి కిందిస్థాయి వరకు ఎలా అమలయ్యాయో ఈ పరిణామాలు నిదర్శనమని జగన్ ఆరోపించారు. కాక్రోచ్‌లు ఎలా పుడతాయో, ఒకదాని నుంచి మరొకటి ఎలా విస్తరిస్తాయో ఈ వ్యవహారం కూడా అలాంటిదేనని వ్యాఖ్యానించారు.

‘బాబు స్కాముల చరిత్రలో చిరస్థాయిగా’
డీఎస్సీ వ్యవహారం చంద్రబాబు స్కాముల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జగన్ అన్నారు. స్పోర్ట్స్ కోటా జీవోలు, ఉద్యోగాల వ్యవహారం, ఆడియో-వీడియో ఆరోపణలు, కేసు దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..