
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నకిలీ ఎక్స్ (X) ఖాతాను ఆధారంగా చూపించి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యేలు బండారు లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందజేశారు.
ముఖ్యమంత్రి సభలో ఫేక్ ఎక్స్ ఖాతాను చూపించి చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. నకిలీ ఖాతాను ఆధారంగా చేసుకుని అసెంబ్లీని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా సభ గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సీఎం చేసిన నిరాధార ఆరోపణల వల్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో ఆధారాలు లేని విషయాలను ప్రస్తావించడం సరికాదని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై అసెంబ్లీ నిబంధనల్లోని రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఇదే అంశంపై అసెంబ్లీ స్పీకర్కు కూడా లేఖ రాశారు. సీఎం వ్యాఖ్యలను పరిశీలించి, సభా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా నకిలీ ఎక్స్ ఖాతాను అసెంబ్లీలో ప్రస్తావించిన అంశం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.