Reading Time: 2 minutes
Telangana Panchayat Own Funds Treasury Delay Seethakka Bill

తెలంగాణలో గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం , సత్వర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70, సబ్ సెక్షన్ 3కు ప్రతిపాదించిన కీలక సవరణ బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గ్రామాలకు వచ్చే సొంత ఆదాయం నేరుగా గ్రామాల అవసరాలకే వేగంగా ఉపయోగపడాలనే సంకల్పంతో ఈ చట్ట సవరణను తీసుకువచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీతనం పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన విధానమని స్పష్టం చేశారు.

స్వయం పాలనకు 73వ రాజ్యాంగ సవరణే స్పూర్తి

దేశంలో గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చిందని మంత్రి సీతక్క గుర్తుచేశారు. గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే ఏజెన్సీలుగా మిగిలిపోకూడదని, ప్రజలకు అత్యంత చేరువగా ఉండే స్వయం పాలనా సంస్థలుగా ఎదగాలన్నదే ఆ సవరణ ముఖ్య ఉద్దేశమని వివరించారు. స్థానిక సంస్థలకు తగిన అధికారాలు, బాధ్యతలతో పాటు ఆర్థిక వనరులను కల్పించినప్పుడే పరిపాలన మెరుగవుతుందని, అందుకే పంచాయతీలకు పన్నులు, సుంకాలు వసూలు చేసుకునే హక్కులు లభించాయని ఆమె పేర్కొన్నారు.

ట్రెజరీ నిబంధనలతో ఇన్నాళ్లూ నిధుల జాప్యం

గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ, పారిశుధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణం , సురక్షిత తాగునీటి సరఫరా వంటి నిత్యవసర పౌర సేవల బాధ్యత పంచాయతీలదేనని మంత్రి వివరించారు. అయితే ఇన్నాళ్లూ గ్రామ పంచాయతీలు వసూలు చేసుకునే సొంత ఆదాయ నిధులను ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సి వచ్చేది. అత్యవసర పనులకు ఆ డబ్బును ఉపయోగిద్దామంటే ట్రెజరీ అనుమతులు, సుదీర్ఘమైన పత్రాల ప్రక్రియ వల్ల తీవ్ర ఆలస్యం జరిగేదని, ఫలితంగా పంచాయతీల వద్ద నిధులున్నా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడేవారని ఆమె గుర్తుచేశారు.

ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే సొంత నిధులు

గ్రామంలో డ్రైనేజీ లీకేజీ, తాగునీటి పైప్‌లైన్ల రిపేర్లు, పారిశుధ్య అత్యవసర పనులు వచ్చినప్పుడు పంచాయతీకి తక్షణమే నిధులు అందుబాటులో ఉండాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి సీతక్క చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ల గ్రాంట్లు నేరుగా పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోకే ఎలా जमा అవుతున్నాయో, అదే విధంగా ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయం కూడా నేరుగా జీపీల బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా ఈ చట్ట సవరణ తోడ్పడుతుందని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సవరణ ద్వారా తెలంగాణలో గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయి ఆర్థిక స్వేచ్ఛ లభించి స్థానిక స్వపరిపాలన మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.