
Railway Accident: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలులోని ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రమాద ప్రభావంతో నార్త్ సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాక్లు పూర్తిగా నిండిపోయాయి. దువ్వాడ రైల్వే స్టేషన్లో షాలిమార్, చెన్నై వైపు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 78 బోగీలతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పారాదీప్ నుంచి ఎరువులను తీసుకుని బారామతికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రైల్వే అధికారులు చేరుకుని సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో రెండు వారాల క్రితం కూడా గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా మరోసారి అదే ప్రాంతంలో ప్రమాదం జరగడంతో రైల్వే ట్రాక్ల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వే అధికారులు మెయింటెనెన్స్ను సక్రమంగా నిర్వహించకపోవడమే ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.