
సాధారణంగా దొంగ అంటే.. తాళం కనిపిస్తే చాలు.. ఇల్లు మొత్తం గుల్ల చేయడమే టార్గెట్!. బంగారం, నగదు కనిపిస్తే.. విలువైన వస్తువు ఏదైనా సరే.. ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం దొంగల స్టైల్! కానీ.. ఈ దొంగ మాత్రం వెరీ డిఫరెంట్! దొంగతనానికి వచ్చాడు.. కానీ తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఆనవాళ్లు ఉండకూడదు.. ఆధారాలు దొరకకూడదు.. తాను అనుకున్నంత సొత్తు దొరికితే చాలు.. సైలెంట్గా అక్కడి నుంచి జారుకుంటాడు.. ఇంతకీ ఆ ‘రూల్స్ దొంగ’ పెట్టుకున్న రూల్స్ ఏంటి? అతని దొంగతనాల స్టైల్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
హైదరాబాద్ బీ జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన పట్నంశెట్టి రాజు కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2009లో సైకిల్ చోరీ కేసు.. జైలుకు వెళ్లొచ్చాడు. అయినా తీరు మారలేదు. 2015, 2016లో జగద్గిరిగుట్టలో ఐదు ఇళ్లను టార్గెట్ చేశాడు. రాత్రివేళ తాళం వేసిన ఇళ్లలో చొరబడి చోరీలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లోనూ జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకొచ్చాక మాత్రం వ్యూహం మార్చాడు. ప్రాంతం మార్చాడు.. పంథా మార్చాడు.. కానీ దొంగతనాలు మాత్రం ఆపలేదు. ఈ దొంగకు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. తనకు అవసరమైనంత మాత్రమే దోచుకోవాలి.. అంతకుమించి ఏది కనిపించినా అక్కడే వదిలేయాలి.. ఇదే అతని దొంగతనాల స్టైల్.
కావాల్సినంతే కొట్టేస్తాడు.. ఎక్కువ కనిపించినా ముట్టుకోడు!.
కారు డ్రైవర్గా పనిచేస్తూ.. సమయం దొరికినప్పుడల్లా కోదాడకు వచ్చేవాడు రాజు. కారును నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసేవాడు. చేతిలోకి స్క్రూ డ్రైవర్ .. కాళ్ళు, చేతులకు సాక్సులు వేసుకునేవాడు. ఎవరూ లేని తాళం వేసిన ఇళ్లను గుర్తించి.. దొంగతనానికి వెళ్లేవాడు. తన అవసరాలకు సరిపడే నగదు, బంగారం, వెండిని మాత్రమే తీసుకునేవాడు. విచిత్రమేంటంటే.. ఇంట్లో ఇంకా విలువైన వస్తువులు కనిపించినా.. అవసరానికి మించి తీసుకునేవాడు కాదు. అదే సమయంలో తన వేలిముద్రలు, ఇతర ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు.
Theft Case
17 ఏళ్ల దొంగతనాల చరిత్ర..
ఇలా కోదాడలోనే ఇప్పటివరకు 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన బంగారాన్ని విజయవాడలో విక్రయించేందుకు కారులో బయల్దేరాడు రాజు. కోదాడలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పోలీసులను గమనించిన రాజు.. కారును మళ్లించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కారును ఆపి రాజును అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు ఒక్కొక్కటిగా దొంగతనాల చిట్టా బయటపడింది. నిందితుడు నుండి 10 తులాల బంగారం, 47 తులాల వెండి, రూ.3.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.