
LG స్మార్ట్ఫోన్లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్జి (LG) స్మార్ట్ టీవీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త నివేదిక యూజర్ల ప్రైవసీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. టెక్ రీసెర్చర్లు నుంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందించిన వివరాల ప్రకారం.. కొన్ని ఎల్జి టీవీలు హోమ్ వై-ఫై నెట్వర్క్కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఇతర డివైజెస్ను గుర్తించగలవని తేలింది. అంతేకాకుండా, ఒక సెక్యూరిటీ లొసుగు కారణంగా టీవీ స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు, స్టాండ్బై మోడ్లో ఉన్న సమయాల్లో కూడా ఆడియో రికార్డు కావచ్చనే వాదనలు వినిపించాయి. ఈ రీసెర్చ్ ప్రకారం.. టీవీలు చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వై-ఫై నెట్వర్క్ పేర్లు, సిగ్నల్ వివరాలను కూడా సేకరించగలవు. ఈ డేటాను వ్యూయింగ్ డేటా, అడ్వర్టైజింగ్ ఐడీలతో జతచేసి యూజర్ల ప్రవర్తనను ట్రేస్ చేయవచ్చు.
టీవీలో రన్ అయ్యే కంటెంట్ను గుర్తించడానికి ఉపయోగించే ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ (ACR) టెక్నాలజీ కూడా ఈ చర్చలో కీలకంగా మారింది. దీని ద్వారా ప్రోగ్రామ్లు, యాడ్స్ను పసిగట్టవచ్చు. అయితే దీనిపై ఎల్జి స్పందిస్తూ.. ఏసీఆర్ అనేది పూర్తిగా యూజర్ ఆప్షన్ అని, అనుమతి లేకుండా ఆ డేటాను వాడమని స్పష్టం చేసింది. స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆడియో రికార్డింగ్ జరగడంపై వస్తున్న వాదనలను ఎల్జి పూర్తిగా ఖండించింది. రిమోట్లోని వాయిస్ బటన్ నొక్కినప్పుడు, ‘హాయ్ ఎల్జి’ అనే వేక్ వర్డ్ ఉపయోగించినప్పుడు మాత్రమే వాయిస్ డేటా ప్రాసెస్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. వేక్ వర్డ్ కోసం ఉపయోగించే ఆడియో డివైస్లోనే ఉంటుందని, ఎలాంటి అనధికార రికార్డింగ్స్ జరగవని పేర్కొంది. స్థానిక నెట్వర్క్లోని ఇతర డివైజెస్ను స్కాన్ చేయడం అనేది కనెక్టివిటీ కోసం ఉపయోగపడే సాధారణ ఫీచర్ అని ఎల్జి వివరణ ఇచ్చింది.
యూజర్లు తమ సెక్యురిటీని కాపాడుకోవడానికి టీవీ ప్రైవసీ సెట్టింగ్స్ను చెక్ చేసుకోవడం ముఖ్యం. ఏసీఆర్, పర్సనలైజ్డ్ యాడ్స్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను అవసరం లేకపోతే డిసేబుల్ చేసుకోవచ్చు. టీవీని గెస్ట్ వై-ఫై నెట్వర్క్లో ఉంచడం ద్వారా భద్రతను మరింత మెరుగుపరచుకోవచ్చు. ఎల్జి తన డివైజెస్లో యూజర్లకు పూర్తి ప్రైవసీ కంట్రోల్ ఇస్తామని, సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామని భరోసా ఇస్తోంది.