
అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘లీడర్షిప్-న్యూ ఏజ్ గవర్నెన్స్’ అనే ప్రధాన అంశంపై పరిపాలనాధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కేవలం సంప్రదాయ విధానాలపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, అయితే మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు నాయకత్వ పటిష్టతపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం ద్వారానే అనుకున్న ఫలితాలను త్వరితగతిన సాధించడంతో పాటు ‘స్వర్ణాంధ్ర విజన్’ లక్ష్యాలను వేగంగా చేరుకోవడం సాధ్యమవుతుందని సీఎం స్పష్టం చేశారు.
కొత్త తరం నాయకత్వం , విశ్వసనీయత
ప్రస్తుతం పరిపాలనారంగం ఒక పరివర్తన దశలో ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కలెక్టర్లు పాత ఆలోచనా విధానాలను వీడి, ప్రజల ఆశలు , అంచనాలకు తగినట్లుగా న్యూ లీడర్షిప్ అప్రోచ్ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతీ నాయకుడు తన టీమ్ను ఎంత ప్రభావవంతంగా తీర్చిదిద్దుకుంటాడో, ఆ ఫలితాలు కూడా అంతే మెరుగ్గా ఉంటాయన్నారు. ఉద్యోగ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్న ఈ రోజుల్లో అంతిమంగా అధికారుల ప్రవర్తన, వారి విశ్వసనీయత మాత్రమే కీలకమని స్పష్టం చేశారు. నాయకత్వం అనేది అంతర్గత ప్రేరణ నుంచి రావాలని, ఇప్పుడు మహిళలు-పురుషులు అనే వ్యత్యాసాలకు తావులేదని పేర్కొన్నారు.
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సద్వినియోగం
మారుతున్న డిజిటల్ యుగంలో నేర్చుకోవడం అనేది నిరంతరం సాగే ప్రక్రియ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బ్యూరోక్రసీకి, రాజకీయ నాయకులకు వేర్వేరు నైపుణ్యాలు అవసరమని, తమ వద్ద ఉన్న నైపుణ్యాలకు ఎంత పదును పెడితే అంత త్వరగా లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు. ఈరోజుల్లో ఫైళ్ల నిర్వహణ నుంచి డేటా లేక్, అవేర్ సిస్టమ్స్ వరకు ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పరిపాలనలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తపడాలని, సాంకేతికత ద్వారా పారదర్శకమైన ఫలితాలు రాబట్టడమే మన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.
ప్రపంచస్థాయిలో మెరుస్తున్న భారతీయ నైపుణ్యాలు
ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్స్ , నిపుణులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన దిగ్గజ కంపెనీలకు భారతీయులే విజయవంతంగా సారథ్యం వహిస్తున్నారని గుర్తుచేశారు. ఏ రకమైన వాతావరణంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా త్వరగా ఇమిడిపోయే ప్రత్యేక నైపుణ్యం భారతీయులకు ఉందన్నారు. ఆ గ్లోబల్ విజన్కు అనుగుణంగా మన రాష్ట్ర అధికారులు కూడా తమ ఆలోచనా పరిధిని విస్తరించుకుని, పాలనలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు.