
Varaha Jayanti Vrat Katha Telugu: హిందూ పురాణాలు, మత విశ్వాసాల ప్రకారం.. విశ్వంలో అధర్మం పెరిగి, భూమి ప్రమాదంలో పడినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూదేవిని రక్షించారు. దశావతారాల్లో వరాహ అవతారాన్ని శ్రీమహావిష్ణువు మూడవ అవతారంగా భావిస్తారు. ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన వరాహ జయంతిని సెప్టెంబర్ 13న జరుపుకుంటున్నారు. పురాణ కథనం ప్రకారం.. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన అపారమైన బలం, అహంకారంతో మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేశాడు. చివరకు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లి దాచిపెట్టాడు. దీంతో సృష్టి మొత్తం అస్తవ్యస్తంగా మారింది. భూమిని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి, హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని తిరిగి తన స్థానంలో నిలిపారు.
వరాహ జయంతి రోజున ఈ అవతార కథను చదవడం, వినడం, శ్రీ వరాహ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. అసలు వరాహ అవతారం ఎలా జరిగింది? హిరణ్యాక్షుడిని శ్రీమహావిష్ణువు ఎలా సంహరించారు? తెలుసుకుందాం.
హిరణ్యాక్షుడి అరాచకం
పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు అత్యంత శక్తివంతమైన రాక్షసుడు. అపారమైన బలంతో పాటు అతనిలో అహంకారం కూడా పెరిగింది. తన శక్తితో దేవతలను ఓడించి, మూడు లోకాలలో భయాందోళనలు సృష్టించాడు. అతని దురాగతాలు అంతటితో ఆగలేదు. భూమిని తన ఆధీనంలోకి తీసుకుని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లి దాచిపెట్టాడని పురాణ కథనం చెబుతుంది. భూమి జలాల్లో మునిగిపోవడంతో సృష్టి వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దేవతలు, ఋషులు ఆందోళనకు గురై శ్రీమహావిష్ణువును ప్రార్థించారు.
వరాహ రూపంలో అవతరించిన విష్ణుమూర్తి
భూమిని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు అద్భుతమైన వరాహ రూపాన్ని ధరించారు. కొన్ని పురాణ కథనాల్లో ఆయన మొదట చిన్న రూపంలో ప్రత్యక్షమై, క్రమంగా భారీ రూపాన్ని ధరించినట్లు వర్ణించబడింది. వరాహ స్వరూపంలో శ్రీమహావిష్ణువు సముద్ర గర్భంలోకి ప్రవేశించి భూదేవిని వెతికారు. చివరకు అగాధంలో ఉన్న భూమిని గుర్తించి, తన బలమైన దంతాలపై ఆమె(భూమి)ను ఎత్తుకున్నారు.
భూదేవిని సురక్షితంగా పైకి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు వరాహమూర్తిని అడ్డుకుని యుద్ధానికి సవాలు చేశాడు.
హిరణ్యాక్షుడితో భీకర యుద్ధం
వరాహమూర్తికి, హిరణ్యాక్షుడికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఇద్దరూ తమ అపారమైన శక్తిని ప్రదర్శిస్తూ చాలాసేపు పోరాడారు. చివరకు శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించారు. రాక్షసుడిని సంహరించిన అనంతరం వరాహమూర్తి భూదేవిని తన దంతాలపై మోసుకెళ్లి సురక్షితంగా తిరిగి తన స్థానంలో ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీంతో సృష్టిలో ఏర్పడిన సంక్షోభం తొలగిపోయి, విశ్వ సమతుల్యత తిరిగి నెలకొంది. ధర్మం పునరుద్ధరించబడింది. ఈ విధంగా శ్రీమహావిష్ణువు వరాహ అవతారంలో భూదేవిని రక్షించి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని చాటిచెప్పారు.
వరాహ జయంతి ప్రాముఖ్యత ఏమిటి?
వరాహ జయంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా.. ధర్మాన్ని రక్షించేందుకు భగవంతుడు అవతరిస్తాడనే విశ్వాసానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున వరాహ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం, ఉపవాసం ఉండటం, విష్ణు నామస్మరణ చేయడం, వరాహ అవతార కథను చదవడం లేదా వినడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగి, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని, కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.
వరాహ అవతార కథలో భూమిని రక్షించడం ద్వారా శ్రీమహావిష్ణువు ధర్మం, రక్షణ, సృష్టి సమతుల్యతకు ప్రతీకగా నిలిచారు. అందుకే వరాహ జయంతి రోజున ఈ అవతారాన్ని స్మరించుకోవడం విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉందని భక్తులు విశ్వసిస్తారు.
(Disclaimer: ఈ కథనం పురాణాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడింది. ఇందులోని అంశాలను భక్తి, సంప్రదాయ విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)