
BRICS: న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్యదేశాలు ‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడి’’ని తీవ్రంగా ఖండించాయి. బ్రిక్స్ దేశాల సంయుక్త ప్రకటనలో 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. “2025 ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో 26 మంది మరణించగా, మరెందరో గాయపడ్డారు” అని బ్రిక్స్ సంయుక్త ప్రకటనలో నేతలు పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిని బ్రిక్స్ సభ్యదేశాల సంయుక్త ప్రకటనలో ప్రస్తావించడాన్ని భారత దౌత్య విజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కొనేందుకు తమ నిబద్ధతను బ్రిక్స్ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం ఉగ్రవాదానికి నిధులు, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉగ్రవాదంపై ‘‘జీరో టాలరెన్స్’’ విధానంపై నేతలంతా ఒక్కతాటిపై ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలను తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని బాధ్యులుగా గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని వరసగా రెండు బ్రిక్స్ సమావేశాల్లో ప్రస్తావించారు. గతేడాది సెప్టెంబర్లో బ్రిక్స్ మంత్రుల సంయుక్త ప్రకటనలో కూడా దీనిని ఖండించారు.