Reading Time: 2 minutes
India Women Vs Bangladesh Women Asia Cup 2026 Semi Final Match Preview Records Are

Asia Cup 2026 semi Final: భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్లు ఆసియా కప్‌ 2026 తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ వరుసగా మూడు విజయాలతో సెమీఫైనల్‌కు చేరుకోగా.. బంగ్లాదేశ్ రెండు విజయాలు, ఒక ఓటమితో నాకౌట్‌ పోరుకు వచ్చింది.

భారత్ తరఫున స్మృతి మంధాన, షెఫాలీ వర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో దీప్తి శర్మ, శ్రీ చరణి అద్భుత ఫామ్‌లో ఉండటంతో వారిపైనే అందరి దృష్టి ఉంది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసిన మారుఫా అక్తర్ కీలకం కానుంది. బ్యాటింగ్‌లో మూడు మ్యాచ్‌ల్లో 77 పరుగులు చేసిన శోభనా మొస్తరీపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.

టీ20ల్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్లు ఇప్పటివరకు 24 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ ఏకంగా 21 విజయాలు సాధించగా.. బంగ్లాదేశ్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. వన్డేల్లోనూ భారత్‌దే ఆధిపత్యం. ఇరు జట్లు తొమ్మిది వన్డేల్లో తలపడగా భారత్ ఆరు విజయాలు సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ అత్యధికంగా 163/5 పరుగులు చేసింది. 2016లో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు నమోదైంది. ఇక భారత్‌పై బంగ్లాదేశ్ అత్యల్పంగా 51 పరుగులకే ఆలౌటైంది. 2023 ఆసియా క్రీడల మహిళల క్రికెట్ పోటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇరు జట్ల టీ20 పోరులో అత్యధిక వ్యక్తిగత స్కోరు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉంది. 2014 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సిల్హెట్ వేదికగా ఆమె 59 బంతుల్లో 77 పరుగులు చేసింది. బౌలింగ్‌లో భారత్‌ బౌలర్ శ్రవంతి నాయుడు 4/9 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశారు. భారత్–బంగ్లాదేశ్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగుతోంది. ఆమె 19 ఇన్నింగ్స్‌ల్లో 496 పరుగులు చేసింది. స్మృతి మంధాన 18 ఇన్నింగ్స్‌ల్లో 380 పరుగులతో రెండో స్థానంలో ఉంది. బౌలింగ్‌లో పూనమ్ యాదవ్ 9 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో అగ్రస్థానంలో ఉంది.

ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో షెఫాలీ వర్మ 34 బంతుల్లో 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. రాధా యాదవ్ 3/28తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ సెమీఫైనల్లోనూ భారత్‌దే పైచేయి సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.