Reading Time: < 1 minute
Pm Modi Xi Jinping Meeting Chinese President Says India China Can Learn From Each Other

PM Modi-Xi Jinping: 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో, జిన్‌పింగ్ శనివారం భేటీ అయ్యారు. భారత్, చైనాలు తమ పరస్పర బలాల నుంచి నేర్చుకుని, ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి సాధించగలవని అన్నారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీతో చైనా అధ్యక్షుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు సమస్య, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై రెండు దేశాలు చర్చించినట్లు తెలుస్తోంది.

బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు చేసిన సానుకూల వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ స్వాగతించారు. భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో చైనా అందించిన సహకారానికి మోడీ థాంక్స్ చెప్పారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం అవకాశం కల్పించిందని అన్నారు.

తన పుట్టిన రోజైన జూన్ 15న భారత పర్యటనకు తనకు ఆహ్వానం వచ్చిందని జిన్‌పింగ్ తెలిపారు. గతంలో మోడీతో 21 సార్లు భేటీ అయినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశాల్లో కుదిరిన పలు ముఖ్యమైన అవగాహనలు భారత్-చైనా సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకెళ్తాయని అన్నారు.

ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు..

భారత్, చైనాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకోవడం, పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా రెండు దేశాలు ఉమ్మడి విజయాన్ని, అభివృద్ధిని సాధించవచ్చని జిన్‌పింగ్ అన్నారు. చైనా ఎప్పుడూ భారత్‌తో సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తాయని చెప్పారు. ప్రపంచంలో చోటుచేసుకున్న పరిణామాలు గత శతాబ్ధకాలంలో ఎప్పుడూ చూడలేదని, ఈ సవాళ్ల మధ్య ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో కీలక దేశాలుగా ఉన్న భారత్, చైనాలకు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయని అన్నారు. మానవాళి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రెండు దేశాలు కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ సూచించారు.