
- పంజాబ్లో వ్యక్తి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ రియాక్షన్
- ఆప్ సర్కార్పై తీవ్ర విమర్శలు
చండీగఢ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో సర్కారును ప్రశ్నించిన వారిని బెదిరించి, టార్చర్ చేసే ప్యాటర్న్ నడుస్తోందని కాంగ్రెస్అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే, బెదిరింపులు, హింస రూపంలో సమాధానం వస్తున్నదని ఫైర్అయ్యారు.
డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసిన 50 ఏండ్ల వ్యక్తి గుల్జార్ సింగ్ ఆత్మహత్య ఉదంతాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డ్రగ్స్సమస్యపై పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమాను ప్రశ్నించినందుకు.. క్షమాపణ చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో సంగ్రూర్ జిల్లాకు చెందిన గుల్జార్ సింగ్ పురుగుమందు తాగాడని రాహుల్ఆరోపించారు.
‘దళిత వర్గానికి చెందిన గుల్జార్ సింగ్.. తన కుమారుడు మాదకద్రవ్యాల బారిన పడటాన్ని చూసి తల్లడిల్లారు. ఆయన ఆర్థిక మంత్రిని కేవలం ఒక్కటే అడిగారు. మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైంది? అని. కేవలం ఈ ప్రశ్న అడిగినందుకే ఆయనను తీవ్రంగా హింసించి, అవమానించి, క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేశారు. దాంతో ఆయన పురుగుమందు తాగాడు.
సరైన ట్రీట్మెంట్అందక ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తిరుగుతూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు’ అని ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. అలాగే, గతవారం సీఎం భగవంత్ మాన్కు వ్యతిరేకంగా
నిరసన తెలిపినందుకు హింసకు గురైన మోహన్జీత్ సింగ్ అనే యువకుడితో కూడా మాట్లాడానని.. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలే తప్ప, ప్రశ్నించిన వారిని అణచివేయాలని చూడొద్దని రాహుల్ గాంధీ అన్నారు.
శవ రాజకీయాలు చేయొద్దు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్
ఈ ఘటనకు సంబంధించి రాహుల్ ఆరోపణలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. శవ రాజకీయాలు చేయొద్దంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు. ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమాకు క్షమాపణ చెప్పాలని గ్రామ సర్పంచ్, అతని అనుచరులు గుల్జార్ సింగ్ను ఒత్తిడి చేసిన అంశం తెలియడంతో పోలీసులు స్థానిక సర్పంచ్తో పాటు ఐదుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారని పేర్కొన్నారు.తన ప్రభుత్వంలో డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని మాన్ స్పష్టంచేశారు.