
- గస్టు 31 నాటికి కేవలం 865 మిలియన్ యూనిట్లకే పరిమితం
- గతేడాది ఇదే సమయానికి 2,609 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి
- శ్రీశైలం, నాగార్జున సాగర్లో భారీగా తగ్గిన పవర్ జనరేషన్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో జల విద్యుత్ (హైడల్) ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఎల్నినో ప్రభావంతో మూడో వంతుకు పడిపోయింది. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు 31 వరకు కేవలం 865 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయింది. గతేడాది ఇదే కాలంలో 2,609 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది. ప్రధాన జల విద్యుత్ కేంద్రాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లోనూ ఈసారి జనరేషన్ భారీగా తగ్గింది. సరైన వర్షాలు లేక నీటి లభ్యత తగ్గడంతో సాగర్ లెఫ్ట్ కెనాల్, సింగూరు హైడల్ పవర్ జనరేషన్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్రం థర్మల్ విద్యుత్పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
మోటార్లు నడపడంతో పెరిగిన విద్యుత్ వినియోగం..
వానాకాలం ప్రారంభం నుంచే రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు ప్రభావం చూపాయి. కృష్ణా, గోదావరి నదుల ఎగువ ఈప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్రలోనూ వర్షాలు తగ్గడంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహాలు తగ్గాయి. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, పులిచింతల వంటి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండలేదు. రాష్ట్రంలోని 457 మండలాల్లో 74 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 58 మండలాల్లో 60 నుంచి 99 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. వర్షాభావంతో రైతులు బోర్లపై ఆధారపడుతుండగా, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లలో భారీ మోటార్లను నడపాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగింది. సాధారణంగా వానాకాలంలో రాష్ట్ర పీక్ డిమాండ్ 11 వేల మెగావాట్ల వరకు ఉంటే.. ఈసారి 16,500 మెగావాట్లకు చేరింది.
థర్మల్ ప్లాంట్లపై పెరిగిన ఒత్తిడి..
కృష్ణా, గోదావరి బేసిన్లలో కలిపి రాష్ట్రంలో 2,441.76 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిని జెన్కో నిర్వహిస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి హైడల్ పవర్పై ఆధారపడతారు. కానీ ఈసారి జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో థర్మల్ ప్లాంట్లపై ఒత్తిడి పెరుగుతోంది. గతేడాది హైడల్ పవర్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైంది. ఏడాది మొత్తంలో 6,913.42 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి 50 ఏండ్ల రికార్డులను అధిగమించింది. గతేడాది జూన్ నుంచి ఆగస్టు 31 వరకు 2,609.57 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా.. ఈసారి కేవలం 865.28 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది.
వరద ప్రవాహం లేకపోవడం వల్లే..
ప్రాజెక్టులు నిండకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహాలు తగ్గాయి. కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఇన్ఫ్లో రాలేదు. దీంతో గతేడాదితో పోలిస్తే హైడల్ జనరేషన్ భారీగా తగ్గింది. జల విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. యూనిట్కు రూపాయిలోపే ఖర్చవుతుంది. ఈసారి డిమాండ్ భారీగా పెరగడంతో థర్మల్ విద్యుత్ను ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది.– హరీశ్, జెన్కో సీఎండీ, హైదరాబాద్