Reading Time: 2 minutes
Bank Holidays: నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ సేవలన్నీ.

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. సెప్టెంబర్ 11వ తేదీన బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇవాళ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, అలాగే పీఐఎల్‌ఐ విధానంపై పునరాలోచన చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా శుక్రవారం బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. శుక్రవారం సమ్మెతో పాటు సెప్టెంబర్ 12వ తేదీన రెండో శనివారం, సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం, సోమవారం వినాయక చవితి పండుగ సెలవుల కారణంగా బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసి ఉండనున్నాయి.

ఈ నాలుగు రోజుల పాటు బ్యాంక్ వినియోగదారులు నగదు లావాదేవీలు, చెల్లింపులు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలను పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శుక్రవారం సాధారణంగా జరిగే లావాదేవీలన్నీ నిలిచిపోతాయి. ఏటీఎం సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటిక.. పెద్ద మొత్తంలో నగదు అవసరమయ్యేవారు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమ్మె ప్రభావం చూపనుంది. దీంతో ఉద్యోగుల డిమాండ్లపై త్వరితగతిన స్పందించి పరిష్కారం కనుగొనాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదు రోజుల పనిదినాలని డిమాండ్ చేస్తూ సుమారు ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ప్రభుత్వ రంగ, ప్రైవేటు, విదేశీ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకుల కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి.

ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్‌తో సహా తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సంఘాల కూటమి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. నెలలో అన్ని శనివారాలని బ్యాంకు సెలవులుగా ప్రకటించాలని యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను ఆమోదించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తూ యూనియన్లు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పుడు తమ సమస్యను పరిష్కరించకపోతే ఈ నెలలో మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరోసారి సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పుడు ఐదు రోజుల పాటు వరుసగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.