
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ అమీషా పటేల్ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన చర్చ్గేట్లో ఉన్న అమీషా పటేల్ తల్లిదండ్రుల నివాసంలో విలువైన ఆభరణం మాయమైన ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సుమారు రూ.5 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు గాజు చోరీకి గురైంది. ఈ కేసులో ఇంట్లో పనిచేసే మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం మరింత సంచలనంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అమీషా తల్లి ఆశా పటేల్ నివాసంలో సీమా ఘాటే అనే 40 ఏళ్ల మహిళ గత ఏడాదిన్నరగా పనిమనిషిగా పనిచేస్తోంది. 2026 జనవరిలో ఇంట్లోని విలువైన బంగారు గాజు కనిపించకుండా పోయింది. దీంతో ఆశా పటేల్కు సీమాపై అనుమానం రావడంతో.. ఆభరణాన్ని తిరిగి ఇవ్వాలని ఆమెను పలుమార్లు కోరినప్పటికీ ఫలితం లేదు. దీంతో వారు చివరకు పోలీసులను ఆశ్రయించారు.
అమీషా కుటుంబం ఫిర్యాదు ఆధారంగా మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్ డిటెక్షన్ బృందం సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టి, పాల్ఘర్కు చెందిన సీమా ఘాటేను విరార్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 15 వరకు పోలీస్ కస్టడీ విధించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అసలు ఆభరణం ఎక్కడుంది? ఈ చోరీలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక అమీషా పటేల్ కెరీర్ విషయానికి వస్తే.. ‘కహో నా ప్యార్ హై’తో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘గదర్ 2’తో మరోసారి భారీ విజయాన్ని అందుకున్నారు. 2024లో ‘తౌబా తేరా జల్వా’లో కనిపించిన అమీషా, ప్రస్తుతం ఈ చోరీ ఘటన కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.