
Harshit Rana out and Yash Thakur in: టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు మరోసారి షాక్ తగిలింది. అఫ్గానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్తో పాటు 2026 ఆసియా గేమ్స్కు కూడా అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. హర్షిత్ రాణా స్థానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్లో ఉన్న హర్షిత్ కోలుకున్నాడు. అయితే సెప్టెంబర్ 7న నిర్వహించిన మ్యాచ్ సిమ్యులేషన్లో బౌలింగ్ చేస్తుండగా.. అతడి కుడి తొడ కండరాల్లోని రెక్టస్ ఫెమోరిస్కు స్ట్రెయిన్ ఏర్పడింది. దీంతో అతడిని అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్తో పాటు ఆసియా గేమ్స్ నుంచి తప్పించారు.
హర్షిత్ రాణా స్థానంలో విదర్భకు చెందిన 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. ఇటీవలే జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్లు ఆడిన యశ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడి 81 వికెట్లు తీసుకున్నాడు. 7.04 ఎకానమీతో ఆకట్టుకున్నాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది.
మరోవైపు ఆసియా గేమ్స్ 2026 కోసం కూడా బీసీసీఐ పూర్తి స్థాయి జట్టును ప్రకటించింది. ఐచి-నాగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నప్పటికీ.. భారత క్రికెట్ జట్టు తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను సెప్టెంబర్ 28న ఆడనుంది. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్ను ఆసియా గేమ్స్ జట్టులోనూ చేర్చారు. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ల ఫిట్నెస్పై కూడా బీసీసీఐ సందేహాలు వ్యక్తం చేసింది. వీరు ఆడడం ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది.
హర్షిత్ రాణాను ఈ ఏడాది గాయాలు వేధిస్తున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్కు ముందు మోకాలి గాయం కావడంతో ఆ టోర్నీకి దూరమయ్యాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ 2026లోనూ ఆడలేకపోయాడు. జూన్లో తిరిగి క్రికెట్లోకి వచ్చిన అతడు.. జూలైలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మరోసారి హ్యామ్స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా కోలుకుంటున్న సమయంలో రెక్టస్ ఫెమోరిస్ స్ట్రెయిన్ రావడంతో అఫ్గాన్ సిరీస్, ఆసియా గేమ్స్ నుంచి తపుకున్నాడు.