Reading Time: 2 minutes
Brics Summit 2026 Special Menu At Delhis Top Hotels

BRICS Summit 2026: భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ BRICS సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న సదస్సుకు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈ దేశాల నేతలు, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు. భారత్ ఈ ఏడాది BRICS అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. సదస్సు భారత్ మండపంలో జరగనుండగా, ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనున్న ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో ప్రత్యేక మెనూలను సిద్ధం చేశారు. భారతీయ సంప్రదాయాలు, ప్రాంతీయ వంటకాల ప్రత్యేకతలను అంతర్జాతీయ అతిథులకు పరిచయం చేసేలా వంటకాలను రూపొందించారు.

తాజ్ మహల్‌లో ‘ట్రెడిషన్ టు టేబుల్’
తాజ్ మహల్ హోటల్‌లో ‘ట్రెడిషన్ టు టేబుల్’ పేరుతో ప్రత్యేక వంటకాల కలెక్షన్ సిద్ధం చేశారు. తాజ్ చెఫ్‌లకు చిన్ననాటి నుంచి పరిచయమైన, వారి తల్లుల వంటకాల స్ఫూర్తితో ఈ మెనూను రూపొందించారు. భారతీయ ఆతిథ్యంలోని ఆప్యాయతను, దేశీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా దీనిని తీర్చిదిద్దారు. ఆరు ప్రాంతాలకు చెందిన సంప్రదాయ రుచులను అతిథులకు అందించనున్నారు. ఇందులో కాశ్మీర్ స్పైస్డ్ వాల్నట్స్, పురానీ ఢిల్లీ మైదా కాజు, మహారాష్ట్ర భాకర్వాడి, రాజస్థాన్ మినీ కచోరీ, బెంగాల్ కుచో నిమ్కి, తమిళనాడు మురుకు ఉన్నాయి. వివిధ ప్రాంతాల ప్రత్యేక పదార్థాలు, రుచులు, తయారీ విధానాలను ఈ వంటకాలు ప్రతిబింబించనున్నాయి.

ది లీలా ప్యాలెస్‌లో ప్రత్యేక ‘కమలం’ స్వీట్
ది లీలా ప్యాలెస్ న్యూఢిల్లీ కూడా BRICS ప్రతినిధుల కోసం ప్రత్యేక ఆహార అనుభవాన్ని సిద్ధం చేసింది. భారత జాతీయ పుష్పమైన కమలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేకంగా తినదగిన హ్యాండ్‌క్రాఫ్ట్‌డ్ ‘కమలం’ రూపొందించారు. గులాబీ, కుంకుమపువ్వు, యాలకులతో పాటు దేశీయ భారతీయ పండ్లను ఉపయోగించి దీనిని తయారు చేశారు. దీనితో పాటు ఆుజస్య బై ది లీలా మిల్లెట్ కుకీస్, హ్యాండ్‌మేడ్ గ్రానోలా బార్స్, వెల్‌నెస్ ఇన్ఫ్యూషన్స్ కూడా అతిథులకు అందించనున్నారు. భారతీయ పదార్థాలను ఆధునిక ఆహార విధానంతో మేళవిస్తూ ఈ ప్రత్యేక మెనూను రూపొందించారు.

ది లలిత్‌లో గలోటి కబాబ్‌లు.. మిల్లెట్ వంటకాలు
ది లలిత్ న్యూఢిల్లీ కూడా BRICS సదస్సు కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేసింది. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల వంటకాల వారసత్వాన్ని ప్రతిబింబించేలా మెనూను రూపొందించారు. ఇందులో గలోటి కబాబులు, తందూర్‌లో కాల్చిన రొట్టెలు వంటి సంప్రదాయ వంటకాలతో పాటు మిల్లెట్ ఆధారిత వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా మిసో పేస్ట్‌తో బ్రైజ్డ్ ఎగ్‌ప్లాంట్, సిమ్మర్డ్ చైనీస్ క్యాబేజీ, అంబర్ సాస్‌తో జపనీస్ స్టైల్ కిడ్నీ బీన్ స్వీట్ వంటి ప్రత్యేక వంటకాలను కూడా చెఫ్‌లు రూపొందించారు. భారతీయ ఆతిథ్యానికి అంతర్జాతీయ రుచులను జోడిస్తూ ఈ మెనూను సిద్ధం చేశారు.