Reading Time: < 1 minute
సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం.. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాల్లో రూ.30 లక్షల అవకతవకలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం పాతకంది గ్రామ సంఘంలో మహిళా సంఘాలకు మంజూరైన స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. వివిధ మహిళా సంఘాల పేర్లపై మంజూరైన రుణాల్లో సుమారు రూ.30 లక్షల మేర నిధులను మాజీ వీవోఏ వినియోగించినట్లు విచారణ నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. రుణాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మహిళలకు ఈ వ్యవహారం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో సదురు మహిళా సభ్యులు మంగళవారం కందిలో నిర్వహించిన డ్వాక్రా మహిళా సంఘాల సమావేశంలో అధికారులను నిలదీశారు.

వీవోఏ మార్పు.. వెబ్‌సైట్‌లో నమోదు కాలేదంటూ నివేదిక గత ఏడాది జనవరిలో గ్రామ సంఘం వీవోఏను తొలగించి కుమ్మరి పుష్పలతను కొత్త వీవోఏగా ఎన్నుకున్నట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె పేరు సెర్ప్ ఐబీ వెబ్‌సైట్‌లో నమోదు కాలేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ రూ.50 వేల గౌరవ వేతనం డ్రా చేసి ఆమెకు చెల్లించినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

గ్రామ సంఘ సమావేశాలకు మండల సమాఖ్య నుంచి కమ్యూనిటీ కోఆర్డినేటర్ క్రమం తప్పకుండా హాజరు కాకపోవడం, ఏపీఎం స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ అవకతవకలకు అవకాశం ఏర్పడినట్లు విచారణ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణలో సుమారు రూ.30 లక్షల మేర అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు గుర్తించినప్పటికీ.. ఇప్పటి వరకు మాజీ వీవోఏపై కఠిన చర్యలు తీసుకోలేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సంబంధిత మహిళా సంఘాలకు కొత్త రుణాల మంజూరు కూడా నిలిచిపోయింది.తమకు రావాల్సిన రుణాలను వెంటనే మంజూరు చేయడంతో పాటు, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలపై ఆధారపడుతున్న తమకు ఈ పరిణామం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.