
న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగంతో ప్రారంభమైంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్కు సముచిత ప్రాతినిధ్యం, ఆర్థిక సంస్థల్లో మార్పులు వంటి అంశాలపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాబోయే 20 ఏళ్లకు బ్రిక్స్ ఒక కొత్త, ప్రతిష్టాత్మక అజెండాతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షత ప్రజా కేంద్రిత, మానవతా ప్రథమ విధానం ఆధారంగా కొనసాగుతోందని ప్రధాని మోదీ చెప్పారు. సౌలభ్యం, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం తమ ప్రాధాన్యతలని వెల్లడించారు.
ప్రపంచ రోడ్మ్యాప్కు మూడు కీలక సూత్రాలు
ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి సమగ్ర రోడ్మ్యాప్ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోడ్మ్యాప్కు ప్రాతినిధ్యం, స్పందన/జవాబుదారీతనం, నియమాల రూపకల్పన అనే మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలని సూచించారు. ప్రపంచ వ్యవస్థలో అన్ని దేశాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండాలని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలు మరింత సమగ్రంగా ఉండాలని ఆయన అన్నారు.
UNSC సంస్కరణలు ఇక ఆలస్యం చేయొద్దు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఇకపై వాయిదా వేయకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పరిస్థితులు మారుతున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థల్లో ప్రాతినిధ్య వ్యవస్థ మాత్రం మార్పులకు అనుగుణంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఆర్థిక సంస్థల్లోనూ మార్పులు అవసరం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న దేశాలకు గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్లో తగిన పాత్ర లభించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ హక్కులు, నాయకత్వ పదవులు, విధాన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి కీలకంగా ఉన్న దేశాలు.. ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించే ప్రక్రియలో కూడా తగిన స్థానం పొందాలని స్పష్టం చేశారు.
బ్రిక్స్కు కొత్త దిశ.. మరో 20 ఏళ్ల అజెండా
ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం చారిత్రాత్మకమైనదని ప్రధాని మోదీ అభివర్ణించారు. బ్రిక్స్ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఈ వేదిక ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోందన్నారు. 20 ఏళ్ల వయసు మానవ జీవితంలో పరిపక్వత, బాధ్యతలు పెరిగే దశకు సంకేతమని.. అదే విధంగా బ్రిక్స్ కూడా తన పరిణతి దశకు చేరుకుందని ప్రధాని వ్యాఖ్యానించారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ వేదికపై బ్రిక్స్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపారు. ఎవరికీ వ్యతిరేకంగా కాకుండా.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్నదే బ్రిక్స్ విధానంగా ఉండాలని ఆయన అన్నారు. సభ్య దేశాల మధ్య ఐక్యత, ఏకాభిప్రాయాన్ని స్పష్టమైన ఫలితాలుగా మార్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
‘కొనసాగింపు–అమలు’ యంత్రాంగం
రాబోయే 20 ఏళ్లకు కొత్త, ప్రతిష్టాత్మక అజెండాతో బ్రిక్స్ ముందుకు సాగాలని ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించారు. ప్రతి ఏడాది బ్రిక్స్ అధ్యక్ష పదవి మారుతున్నప్పటికీ.. దీనివల్ల సంస్థాగత కార్యక్రమాల వేగం తగ్గకూడదన్నారు. ఇందుకోసం ‘కొనసాగింపు మరియు అమలు యంత్రాంగం’ ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదిస్తోందని తెలిపారు. దీని కింద బ్రిక్స్ కార్యక్రమాలు, నిర్ణయాలు, ఫలితాలను ట్రోయికా ద్వారా పర్యవేక్షించవచ్చని సూచించారు.
‘గ్లోబల్ సౌత్’కు మరింత ప్రాధాన్యం
ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనే విషయంలో గ్లోబల్ సౌత్ దేశాలు ముందువరుసలో ఉన్నప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో మాత్రం వెనుకబడి ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ‘విశేషాధికారాల పిరమిడ్’ను ‘భాగస్వామ్య వేదిక’గా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రతి దేశం గొంతు వినిపించేలా, ప్రతి సభ్యుడికి భాగస్వామ్యం ఉండేలా ప్రపంచ వ్యవస్థ మారాలని అన్నారు. అంతర్జాతీయ నిర్ణయాల్లో మానవాళి అభివృద్ధినే కేంద్రంగా ఉంచాలని ప్రధాని స్పష్టం చేశారు.
మొత్తంగా.. బ్రిక్స్ 20 ఏళ్ల ప్రయాణాన్ని కొత్త దశగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. రాబోయే రెండు దశాబ్దాలకు సంస్థను మరింత ప్రభావవంతమైన, సమగ్ర, ఫలితాల ఆధారిత వేదికగా మార్చేందుకు భారత్ తరఫున పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా UNSC సంస్కరణలు, గ్లోబల్ ఆర్థిక సంస్థల్లో మార్పులు, గ్లోబల్ సౌత్కు సముచిత ప్రాతినిధ్యం వంటి అంశాలపై మోదీ ప్రసంగం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వీడియో ఇక్కడ చూడండి..
Sharing my opening remarks during the BRICS Session on ‘Inclusive Global Governance and Strengthening Multilateralism.’
https://t.co/g31TharSOc— Narendra Modi (@narendramodi) September 12, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..