
దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ తుది పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఆదివారం టైటిల్ కోసం తలపడనున్నాయి. దుబాయ్ పిచ్లు నెమ్మదిగా ఉంటూ స్పిన్కు అనుకూలిస్తుండటంతో ఈ హైవోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ ప్రధానంగా రెండు జట్ల స్పిన్ విభాగాల మధ్య ఆధిపత్య పోరుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నమెంట్లో అజేయంగా దూసుకుపోతున్న భారత మహిళల జట్టు అన్ని విభాగాల్లోనూ పూర్తి సమతుల్యతతో కనిపిస్తుంది. టోర్నీలో అత్యధికంగా టీమిండియా స్పిన్నర్లు 26 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్లకు కళ్లెం వేశారు. దీప్తి శర్మ నాయకత్వంలోని స్పిన్ దళంలో శ్రీ చరణి, ప్రేమ రావత్లతో పాటు పేసర్ నందని శర్మ కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ భారీ స్కోర్లు నమోదు చేస్తూ జట్టుకు అదిరిపోయే ఆరంభాలను ఇస్తున్నారు. ముఖ్యంగా షఫాలీ వర్మ 169.69 స్ట్రైక్ రేట్తో 168 పరుగులు సాధించి భీకరమైన ఫామ్లో ఉండటం భారత్కు పెద్ద బలం.
శ్రీలంకకు బ్యాటింగ్ చిక్కులు.. బౌలింగ్ మీదే నమ్మకం
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక కూడా ఇప్పటివరకు టోర్నీలో అన్ని మ్యాచ్లూ గెలిచినప్పటికీ, వారి బ్యాటింగ్ లైనప్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సెమీఫైనల్లో పాకిస్తాన్పై 33 పరుగులకే 4 వికెట్లు, అంతకుముందు బంగ్లాదేశ్పై 44కే 5 వికెట్లు, ఇండోనేషియాపై 45కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆయా సందర్భాల్లో హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హారి, నీలాక్షిక సిల్వా వంటి మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకోవడంతో లంక గట్టెక్కింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (4 ఇన్నింగ్స్ల్లో 63 పరుగులు), ఇమేషా దులని (64 పరుగులు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం లంకను కలవరపెడుతోంది. అయితే సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చమరితో పాటు టోర్నీలో 25 వికెట్లు పడగొట్టిన లంక స్పిన్ అటాక్ భారత్కు గట్టి సవాలు విసరగలదు.
గత రికార్డులు.. 2024 ఫైనల్ పునరావృతమవుతుందా?
గత రికార్డులను పరిశీలిస్తే భారత్దే స్పష్టమైన ఆధిపత్యం. శ్రీలంకతో జరిగిన గత 10 టీ20 మ్యాచ్లలో భారత్ ఏకంగా 9 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇందులో 2025 డిసెంబర్లో శ్రీలంకపై నమోదు చేసిన 5-0 వైట్వాష్ కూడా ఉంది. అయితే భారత్పై లంకకు దక్కిన ఆ ఒక్క విజయం దంబుల్లాలో జరిగిన 2024 ఆసియా కప్ ఫైనల్ కావడం గమనార్హం. నాడు 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి లంక టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆ జ్ఞాపకమే లంకకు ప్రస్తుతం కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
పిచ్ పరిస్థితి – అంచనాలు
దుబాయ్ మైదానంలో ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే 150 కంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. పిచ్ స్లోగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే 9 సార్లు విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. పూర్తి ఆధిపత్యంతో భారత్ ఏడోసారి ట్రోఫీని ముద్దాడుతుందా లేక చమరి సేన మరోసారి సంచలనం సృష్టిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
తుది జట్లు (అంచనా)
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీక రావల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, ప్రేమ రావత్, క్రాంతి గౌడ్, ఎన్. శ్రీ చరణి, నందని శర్మ.
శ్రీలంక: ఇమేషా దులని, చమరి ఆటపట్టు (కెప్టెన్), సంజన కావింది, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, కవిష దిల్హారి, నీలాక్షిక సిల్వా, కౌషిని నుత్యంగన (వికెట్ కీపర్), సుగంధిక కుమారి, చాముడి ప్రబోధ, మిథాలి అయోధ్య.