
తార్నాక, వెలుగు: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధి తార్నాకలోని విజయపురి కాలనీలో శరణప్ప(30), లక్ష్మి(24) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర కిందటే వివాహం జరిగింది. శరణప్ప నాచారంలోని ఫుట్ పాత్ పై టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
గురువారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిద్ర లేచి చూసే సరికి భార్య లక్ష్మి చనిపోయి కనిపించింది. వెంటనే శరణప్ప లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న లాలాగూడ, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీలను గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మి సైతం ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నప్పటికీ, పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.