
CM Chandrababu Warns Collectors: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతోన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ అంశంపై ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ వివరణను ప్రజలకు అర్థమయ్యేలా అద్భుతంగా వివరించారని సీఎం ప్రశంసించారు. తమీమ్ అన్సారియా, భరణిలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇక, ఏడో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాల అమలు స్థాయిపై అధికారులు నివేదికను ప్రదర్శించారు. గత కాన్ఫరెన్స్లో తీసుకున్న నిర్ణయాల్లో 57 నిర్ణయాలు అమలు చేసినట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన నాలుగు నిర్ణయాల్లో రెండు పూర్తిగా అమలు చేశారని తెలిపారు. అలాగే నెట్జీరో కాన్సెప్ట్ను అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అమలు చేసినట్లు అధికారులు వివరించారు.
మరోవైపు, అధికారులు సరైన సన్నద్ధతతో సమావేశాలకు రాకపోతే వారి పనితీరు బయటపడుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే వారిని పక్కనపెడతానని స్పష్టం చేశారు. ఈ నిబంధన అధికారులు మాత్రమే కాకుండా మంత్రులకు, తనకు కూడా వర్తిస్తుందని అన్నారు. నెట్జీరో కాన్సెప్ట్ ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. సమావేశంలో కార్యదర్శి సత్యనారాయణ మరోసారి మాట్లాడేందుకు ప్రయత్నించగా, “మీ టైం అయిపోయింది” అంటూ సీఎం స్పష్టం చేశారు. సమయపాలన పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందేనని, కొన్ని సందర్భాల్లో తాను కఠినంగా వ్యవహరిస్తానని చంద్రబాబు అన్నారు. దీపం ట్రాన్స్ఫర్ సబ్సిడీ విషయంలో కలెక్టర్లు వేస్ అండ్ మీన్స్ పరిస్థితిని పరిశీలించి నిధులు ఇస్తామని చెప్పడంపై సీఎం తీవ్రంగా స్పందించారు. తేదీ ప్రకటించిన తర్వాత ఆ రోజుకు నిధులు సమకూర్చడం, అవసరమైతే అప్పు చేయడం వంటి చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యతేనని, నిర్ణయం ప్రకటించిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
నేచురల్ ఫార్మింగ్ విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎస్సీలకు అందుతున్న ప్రయోజనాలను ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో మాట్లాడాలని, అవసరమైతే సీఎంవోకు రావాలని అధికారులకు చెప్పారు. రెండేళ్లు గడిచినా అమలు చేయలేకపోతున్న పరిస్థితిని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, మరుసటి రోజు సాయంత్రంలోగా సంబంధిత ఉత్తర్వులు తన టేబుల్పై ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు ప్రతి పనికీ సీఎంవోను ఆశ్రయించి బాధ్యత నుంచి తప్పించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం కలెక్టర్ల బాధ్యత అని తేల్చిచెప్పారు. సీఎస్, మంత్రులు, అధికారులు లేదా సీఎంవోలో ఎవరినైనా సంప్రదించండి.. కానీ ప్రజల పనులు మాత్రం పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..