
చైనాలోని కింగ్డావో నగరంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం షిప్యార్డులో నిలిపి ఉంచిన విదేశీ కార్గో నౌకలో మంటలు చెలరేగడంతో 20 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతైనట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కింగ్డావోలోని ప్రభుత్వ ఆధీనంలోని కింగ్డావో బీహై షిప్యార్డులో గురువారం ఉదయం 11:15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నౌకలో మరమ్మతులు, తనిఖీ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నౌకలో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. వీరిలో 12 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మరో ఐదుగురు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నానికి ముందే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
జిన్హువా విడుదల చేసిన ఘటనాస్థల చిత్రాల ద్వారా ప్రమాదానికి గురైన నౌక ‘ఓషన్ మెలోడీ’గా గుర్తించారు. నౌకా రవాణా సమాచార సంస్థ LSEG డేటా ప్రకారం.. ఇది లైబీరియా జెండాతో ప్రయాణించే సుమారు 20 ఏళ్ల నాటి డ్రై బల్క్ కార్గో నౌక. ఈ నౌక నిర్వహణ బాధ్యతలను Yuyangkunpeng Shanghai Ship Management చేపట్టగా.. Huili Shipping Co Ltd రిజిస్టర్డ్ యజమానిగా ఉంది. ఆగస్టు 31న ఈ నౌక కింగ్డావో షిప్యార్డుకు చేరుకుంది. అప్పటి నుంచి అక్కడే మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
జిన్పింగ్ ఆదేశం
ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పందించారు. గల్లంతైన వారి కోసం సెర్చ్, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు జిన్హువా వెల్లడించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద షిప్బిల్డర్లలో CSSC
ఈ ప్రమాదం జరిగిన షిప్యార్డు చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ చైనా స్టేట్ షిప్బిల్డింగ్ కార్పొరేషన్ (CSSC) ఆధీనంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థల్లో CSSC ఒకటి. చైనా నౌకాదళానికి ప్రధాన నౌకా నిర్మాణ సంస్థగా, నౌకలు మరియు ఆఫ్షోర్ పరికరాల రూపకల్పన, నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద సంస్థగా CSSC తనను తాను పేర్కొంటుంది. CSSCకి చెందిన కింగ్డావో యూనిట్ వెబ్సైట్లో 2022లో విడుదలైన ఓ నియామక ప్రకటన ప్రకారం.. ఈ షిప్యార్డుకు ఏడాదికి 30 లక్షల డెడ్వెయిట్ టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యం ఉంది. అలాగే ఏడాదికి 212 నౌకలకు మరమ్మతులు చేసే సామర్థ్యం కూడా ఈ యూనిట్కు ఉన్నట్లు పేర్కొన్నారు.