Reading Time: < 1 minute
Sabita Indra Reddy Delhi National Womens Commission Brs Mlas Assembly Incident

Sabita Indra Reddy: తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ భారతదేశం మొత్తం చూస్తుందని, మానవ హక్కుల సంఘంతో పాటు, మహిళ కమిషన్ వివరించామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌ను బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన అంశాలను వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రాష్ట్రంలోని సమస్యల పైన సభలో చర్చ జరగాలని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే.. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తుండగా.. అసెంబ్లీలో కాలు పెట్టకముందే మమ్మల్ని పోలీసులు ఆపారన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు ఆపారు అని అడిగితే.. నల్ల చుక్కలు వేసుకున్నారని నిలవరించారని చెప్పారు. రాహుల్ గాంధీ పార్లమెంటుకు నల్ల టిషర్ట్ వేసుకొని వెళ్తున్నారని పోలీసులను ప్రశ్నించామన్నారు.

“నల్ల టీషర్ట్స్‌పై ప్రభుత్వం విఫలమైందని ఉన్న అక్షరాలు అబ్జక్షన్ అని చెప్పారు. మా డ్రెస్ల పైన ఎటువంటి అభ్యంతరకర రాతలు లేవు.. అయినా మమ్మల్ని అసెంబ్లీకి వెళ్లకుండా చేశారు. మనసులు గాయపడ్డాయి. భారమైన గుండెలతో మాట్లాడుతున్నాం. మంత్రులుగా పనిచేశాం. అసెంబ్లీలోకి రాకుండా.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు.. 40 మంది ప్రజాప్రతినిధులమంటే.. దాదాపు 500 మంది పోలీసులు ఆక్కడ పెట్టారు. మగ పోలీసులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. చీర లాగారు. దుశ్శాసన పర్వాన్ని చూపెట్టారు. ద్రౌపదికి జరిగిన సంఘటన పునరావృతమైంది. దేవాలయం లాంటి అసెంబ్లీ ప్రాంగణంలో.. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఇటువంటి ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. ఇది అత్యంత దౌర్భాగ్యం. చీర జుట్టు పట్టి లాగారు.. ఇతర ఎమ్మెల్యేలను కింద పడేసి తొక్కారు. ఇది కుట్ర పూరితంగా జరిగిన వ్యవహారమే.” అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.