Reading Time: < 1 minute
Xi Jinping India Visit Brics Summit Delhi September 2026

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటన ఖరారైంది. ఈనెల 12-13 తేదీల్లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు జిన్‌పింగ్ భారత్ వస్తున్నట్లుగా గురువారం చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జిన్‌పింగ్ సెప్టెంబర్ 12, 13 తేదీల మధ్య భారతదేశంలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.

ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇటీవలి నెలల్లో భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆయన పర్యటనను ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. అంతకుముందు ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఒకే వేదికను పంచుకున్నారు. అక్కడ వారు కరచాలనం చేసుకున్నప్పటికీ.. ఎలాంటి అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12-13 వరకు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి బ్రిక్స్ దేశాధినేతలు హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఢిల్లీకి రానున్నారు.