
ఇండిగో విమానాలకు వరుసగా ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన మరువక ముందే అహ్మదాబాద్ లో మరో ప్రమాదం జరిగింది. గురువారం (సెప్టెంబర్ 10) అహ్మదాబాద్ లో బాంబు బెదిరింపుల సమాచారంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అహ్మదాబాద్ నుంచి దమ్మామ్ కు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E97 లో బాంబు బెదిరింపువచ్చాయి. బాంబు అని రాసివున్న ఓ టిష్యూ పేపర్ ముక్క సిబ్బందికి లభించడంతో అప్రమత్తమయ్యారు. విమానాన్ని వెంటనే దారి మళ్లించి తిరి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.వారిని సురక్షితంగా టర్మినల్ 2కు తరలించారు.
ఘటన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) , లోకల్ పోలీసులు, CISF సిబ్బంది విమానాన్ని బాంబు కోసం తనఖీచేశారు. అయితే విమానంలో ఎటువంటి అనుమానిత వస్తువులను కనుగొనలేదని పోలీసులు తెలిపారు.
ఇటీవల కాలంలో ఇండిగో విమానాలకు వరుస ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం నవీ ముంబైనుంచి శ్రీనగర్ కు వెళ్లిన ఇండిగో విమానం శ్రీనగర్ ఎయిర్ పోర్టులో పార్కింగ్ చేస్తుండగా ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం ధ్వంసమయ్యింది. సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు. తాజాగా అహ్మదాబాద్ లో బాంబు బెదిరింపులతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.