Reading Time: 2 minutes
Team India: 6 నెలల్లో 41 మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఇక నాన్ స్టాప్ పండగే..!

Team India Schedule: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ తర్వాత దొరికిన చిన్నపాటి విరామం ముగియడంతో భారత క్రికెట్ జట్టు మళ్ళీ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానుంది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభమయ్యే వరకు టీమిండియా ఏకంగా 41 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ బిజీ షెడ్యూల్‌లో ఏడు టెస్టులు, 14 వన్డేలు, 20 T20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ భారీ షెడ్యూల్ ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపకుండా, వారి ఫిట్‌నెస్‌ను కాపాడటానికి బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఆఫ్ఘానిస్తాన్‌తో మొదలు..

సెప్టెంబర్ 13 ఆదివారం నుంచి సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు T20ల సిరీస్‌తో భారత క్రికెట్ సందడి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ముగియగానే, భారత్ సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు T20ల సిరీస్‌లో తలపడుతుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. సరిగ్గా అదే సమయంలో, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని మరొక ఇండియన్ టీం జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్‌లో పాల్గొననుంది. అలాగే, ఈ నెల 22న జపాన్‌తో ఏకైక చారిత్రాత్మక T20 మ్యాచ్ కూడా ఆడనుంది.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

న్యూజిలాండ్ సిరీస్..

ఇక అక్టోబర్ చివర్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు T20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు జరుగుతుంది. డిసెంబర్ 13 నుంచి 27 మధ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు T20ల సిరీస్ జరగనుంది. కొత్త సంవత్సరం జనవరి 3 నుంచి 7 మధ్య జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

బిజీ షెడ్యూల్..

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా కీలకమైన ఆటగాళ్లు గాయాల పాలయ్యే ప్రమాదం ఉండటంతో, బీసీసీఐ ఉన్నత అధికారులు రివ్యూ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ ప్లేయర్లకు తగిన విశ్రాంతిని ఇస్తూ, రొటేషన్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు. సీనియర్లకు కాలానుగుణంగా రెస్ట్ ఇస్తూ, యంగ్ ప్లేయర్లను రిజర్వ్ బెంచ్ ద్వారా రంగంలోకి దించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ పాలసీ ద్వారా కీలక ఆటగాళ్లకు శారీరక, మానసిక విశ్రాంతి లభించి, పెద్ద టోర్నమెంట్‌ల ముందు వారు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేలా చూస్తారు.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

ఫైనల్ టచ్ గా ఆస్ట్రేలియాతో..

చివరగా, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 27 మధ్య జరగనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి మొదటి వారంలో ఐపీఎల్ 2027 హంగామా షురూ కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..