
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకశం ఉందని తెలిపింది. దీంతో 48 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన జారీ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉదయం 05:30 గంటల నాటికి ఉత్తర బంగాళాఖాతం,పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసి పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
రెండ్రోజుల పాటు వర్షాలు
రెండు రోజులు పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అయితే ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మధ్యాహ్నం వేళల్లో ఎండ ప్రభావం కనిపిస్తోంది. వేసవికాలాన్ని తలపించినట్లు భానుడి ప్రభావం చూపుతున్నాడు. దీంతో ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎండతో పాటు ఉక్కబోత కూడా వేధిస్తోంది. అయితే ఒక్కసారిగా ఎండ ప్రభావం తగ్గి వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడి నుంచి కాస్త ఊరట చెందుతున్నారు. అయితే ఎల్నీవో ప్రభావం వల్ల ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు పంట సాగుకు దూరమవుతున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలు వేయడం లేదు.
పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మూడ్రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవాకశముందని తెలిపింది. ఈదురుగాలులు భారీగా వీచే అవకాశం ఉన్నందున కరెంట్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిల్చోవద్దని స్పష్టం చేసింది.