
Mahendragiri Varahi: అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్ హీరోగా, సుబ్రహ్మణ్యపురం డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. మీనాక్షి గోస్వామి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, ఒకప్పటి నటి మంజు భార్గవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా, తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
మహేంద్రగిరి వారాహి కథ:
విజయనగరం జిల్లాకి సమీపంలో ఉండే మహేంద్రగిరి అనే ఊరి గ్రామదేవత వారాహి. అయితే ఆ ఊరి రాజ కుటుంబానికి వారాహిమాత శాపం ఉంటుంది. ఆ శాపం కారణంగా ఆ రాజ కుటుంబానికి చెందిన వారసుడు 33 సంవత్సరాలకు ఏదో ఒక ప్రమాదంతో మరణిస్తూ ఉంటాడు. మరోపక్క హైదరాబాదులో నివాసం ఉండే సిద్ధార్థ్ (సుమంత్) ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ దాని ద్వారా భక్తి పేరుతో జరిగే మోసాలను బయటపెడుతూ ఉంటాడు. అయితే కుటుంబంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సిద్ధార్థ్ తన అన్న పెళ్లి శాంతి పూజల కోసం హైదరాబాదు నుంచి విజయనగరం దగ్గరలో ఉన్న ఈ మహేంద్రగిరి వారాహి అమ్మవారి దేవస్థానానికి చేరుకుంటాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో రాజ కుటుంబానికి చెందిన వారసుడితో పాటు సిద్ధార్థ్ అన్న రాజీవ్, కమల్ కామరాజు కూడా మరణిస్తారు. అయితే అసలు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తితో పాటు సిద్ధార్థ్ అన్న ఎందుకు చనిపోయాడు? అసలు రాజ కుటుంబానికి వారాహిమాత ఎందుకు శాపం ఇచ్చింది? అసలు ఆ శాపం నిజమేనా, అమ్మవారు ఎందుకు పగబట్టి ఆ కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా కథ ఏమిటి అనే విషయాన్ని ప్రమోషనల్ కంటెంట్ తోనే చూచాయిగా చెప్పేసాడు దర్శకుడు. అయితే అసలు ఆ శాపాలు ఎందుకు? ఆ శాపాలు నిజమేనా కాదా? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే థియేటర్లకు ప్రేక్షకులు వెళ్తారు. ఇక సినిమా ప్రారంభమైన వెంటనే ఈ మధ్యకాలంలో బాగా ఫాలో అవుతున్న ట్రెండ్ ప్రకారమే AI ద్వారా కథ కొంతవరకు చెప్పించి తర్వాత అసలు కథలోకి తీసుకువెళ్తాడు. ముందుగా హీరో పరిచయం, ఆ తర్వాత అసలు వారాహి అమ్మవారి శాపం ఆ కుటుంబాన్ని ఎలా వెంటాడుతోంది, అసలు ఆ శాపం ఎందుకు ఏర్పడింది అనే విషయాలను ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే శాపం ఎందుకు అనే విషయాన్ని సెకండ్ హాఫ్ వరకు దాచారు. ఫస్ట్ హాఫ్ లో నిజంగానే అమ్మవారి దైవిక శక్తిలా వచ్చి ఆ కుటుంబంలోని వారసులను చంపుతున్న ఫీలింగ్ కలిగించి ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగా నడిపించారు. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథలో వేగం నెమ్మదిస్తుంది. సుమంత్ “అసలు అమ్మవారు ఎందుకు చంపుతుంది? అమ్మ దేవుడైతే ఇలా ప్రాణాలు తీయడానికి సిద్ధం అవుతుందా?” అనుకుంటూ ఆలోచనలో పడి ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క ట్విస్ట్ ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం బాగుంది. ప్రేక్షకుల ఊహకు అందకుండా సినిమాని రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే అప్పటివరకు ప్రేక్షకులకు ఒకింత బోర్ ఫీలింగ్ కలిగేలా దర్శకుడు చేశాడు. కాకపోతే సీన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే చివర్లో వచ్చే ట్విస్టులకు వాల్యూ ఉండదు కాబట్టి, కొంత లాగ్ ఫీలింగ్ కలిగిన ప్రేక్షకులకు తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నిడివి విషయంలో కేర్ తీసుకుని గ్రాఫిక్స్ ఇంకా బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే, సుమంత్ సిద్ధార్థ అనే నాస్తిక యూట్యూబ్ పాత్రలో ఇమిడిపోయాడు. ఆయనకి ఇది కొత్త పాత్ర ఏమి కాదు, గతంలో ఇలాంటి పాత్రలు చాలా చేశాడు. ఇందులో కూడా అలాంటి తరహా పాత్రలోనే కనిపించాడు. కమల్ కామరాజు పాత్ర పరిమితమే. ఇక మంజు భార్గవి, మీనాక్షి గోస్వామి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ పాత్రలు ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర పరిమితమైనా సినిమాని మలుపు తిప్పే విధంగా ఆ పాత్ర ఉంటుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బానే ఉన్నా దానిని పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తడబడ్డాడు. ఇక రైటింగ్ వరకు బాగానే ఉంది. సినిమా ఎందుకో డార్క్ టోన్ లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కావాలని ఎంచుకున్నారో లేక ఎందుకో తెలియదు కానీ, సినిమా అంతా ఒక రకమైన డార్క్ టోన్ తోనే నింపేశారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.