Reading Time: < 1 minute
Suvendu Adhikari Fish Bhog Kalighat Temple Non Veg Row

పశ్చిమ బెంగాల్‌లో చేపలు, మాంసాహారంపై మరోసారి రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. దీంతో ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్‌కతాలోని కలీఘాట్ ఆలయంలో కౌశికి అమావాస్య సందర్భంగా సంప్రదాయ చేపల భోగ్‌ను స్వీకరించారు. బెంగాల్‌లోని శాక్త సంప్రదాయాల్లో చేపల నైవేద్యానికి ఉన్న ప్రాధాన్యతను ఇది ప్రతిబింబిస్తుందని బీజేపీ పేర్కొంది. దుర్గాపూజ సమయంలో బెంగాలీలు మాంసాహారం తీసుకోవద్దంటూ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్ ప్రజల ఆహారపు అలవాట్లను బయట నుంచి వచ్చిన మతపెద్దలు నిర్ణయించకూడదని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు.

కౌశికి అమావాస్య సందర్భంగా కలీఘాట్ ఆలయాన్ని సందర్శించిన సువేందు అధికారి అక్కడ సంప్రదాయ చేపల భోగ్‌ను స్వీకరించారు. బెంగాల్‌లో శాక్త సంప్రదాయంలో దేవతలకు చేపలు, మాంసాహారం నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బెంగాల్‌లో ప్రజలు ఏం తినాలనే విషయంలో ఇతరులు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య కూడా బెంగాలీలు చేపలు, మాంసం తినడం కొనసాగిస్తారని గతంలో వ్యాఖ్యానించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కలీఘాట్ ఆలయంలో సువేందు అధికారి చేపల భోగ్‌ స్వీకరించడాన్ని సమర్థించారు. ఇది బెంగాల్‌ సంప్రదాయాలకు అనుగుణంగానే ఉందని పేర్కొన్నారు.

ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలపై సువేందు ఏమన్నారు?

కలీఘాట్ పర్యటన సందర్భంగా ధీరేంద్ర శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై సువేందు అధికారిని ప్రశ్నించగా.. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. అయితే ఆ సూచనలను పాటించాలా వద్దా అనేది ప్రజల వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. తాను అనుసరించే హిందూ ఆచారాలను ఉదాహరణగా చూపుతూ వివిధ సందర్భాల్లో ఆహారపు విధానాలు మారుతాయని సువేందు వివరించారు. మహాష్టమి సందర్భంగా దుర్గాదేవిని పూజించే సమయంలో తాను సాత్విక ఆహారం తీసుకుంటానని, కార్తీక మాసంలోనూ సాత్విక ఆహారాన్నే తీసుకుంటానని చెప్పారు. అదే సమయంలో అమ్మవారికి సమర్పించే మేక మాంసం వంటి నాన్‌వెజ్‌ ప్రసాదాన్ని కూడా తాను స్వీకరిస్తానని తెలిపారు. ఒక సాధువు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దాన్ని అంగీకరించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని సువేందు అధికారి స్పష్టం చేశారు.