Reading Time: 2 minutes

బ్రిక్స్ సదస్సు ఎఫెక్ట్.. భారత్ వర్సెస్ ఆఫ్ఘన్ తొలి టీ20 మ్యాచ్‌ వాయిదా?

Caption of Image.

IND vs AFG Postponed: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ (IND vs AFG) మధ్య సెప్టెంబర్ 13వ తేదీన జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని మైదానంలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినప్పటికీ, తాజా భద్రతా సమీక్షల నేపథ్యంలో బీసీసీఐ (BCCI) నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మ్యాచ్ వాయిదాకి కారణమేంటి?: 

సెప్టెంబర్ 13వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit) జరగడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. బ్రిక్స్ సదస్సు కోసం పలు దేశాల అగ్రనేతలు, దౌత్యవేత్తలు ఢిల్లీకి తరలిరానున్నారు. దీంతో నగరవ్యాప్తంగా భారీ స్థాయిలో భద్రతా దళాలను రంగంలోకి దించాల్సి ఉంటుంది. అరుణ్ జైట్లీ స్టేడియం సెంట్రల్ ఢిల్లీలోనే ఉంది. బ్రిక్స్ సదస్సు వేళ ఇదే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు, వీఐపీ కదలికలు ఉంటాయి. అదే రోజు వేలాది మంది అభిమానుల మధ్య అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం సెక్యూరిటీ ఏజెన్సీలకు అదనపు భారం కానుంది. ఒకే రోజు రెండు భారీ ఈవెంట్లు జరగడంతో శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు సాధారణ ప్రజల రవాణాకు ఆటంకం కలుగుతుందని భద్రతా విభాగం భావిస్తోంది.

బీసీసీఐ పరిశీలనలో రీషెడ్యూల్ ఆప్షన్లు: 

ఈ క్రమంలో మ్యాచ్‌ను సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మరో తేదీకి రీషెడ్యూల్ చేసే ఆప్షన్‌పై బీసీసీఐ, ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలకు ఏమాత్రం భంగం కలగకుండా మ్యాచ్ తేదీల్లో మార్పులు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ సిరీస్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్న వేళ, బీసీసీఐ తీసుకోబోయే తుది నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.